మంచు తుఫాను దాటికి అగ్రరాజ్యం అమెరికా చివురుటాకులా వణుకుతోంది.గత కొద్దిరోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను మంచు ఠారెత్తిస్తోంది.ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వీల్లేకుండా రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి.
టెక్సాస్, అలబామా, ఒరెగాన్, ఒక్లహోమా, కాన్సస్, కెంటకీ, మిసిసిపీ రాష్ట్రాల్లో మంచు తుఫాను తీవ్రత దృష్ట్యా అక్కడ అత్యవసర పరిస్థితి విధించారు.మిగిలిన అన్ని రాష్ట్రాలతో పోలిస్తే టెక్సాస్లో పరిస్థితి భయానకంగా వుంది.
విద్యుత్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.పైపుల్లో నీరు గడ్డ కట్టుకుపోవడంతో ప్రజలు తాగేందుకు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికీ 27 లక్షల మందికిపైగా ప్రజలు చీకట్లోనే మగ్గిపోతున్నారు.
గాల్వెస్టన్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు 95 శాతం ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది.
టెక్సాస్లో పోలీసులు, మిలటరీ నేషనల్ గార్డ్స్ సాయంతో ప్రజల వద్దకు వెళ్లి వారి క్షేమ సమాచారం గురించి ఆరాతీస్తున్నారు.రోడ్లపై మంచు తొలగించడానికి స్థానికుల సాయం తీసుకుంటున్నారు.
ఆరోగ్య సిబ్బంది, పవర్ గ్రిడ్ కార్మికుల విధులకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.సహాయ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 135 వార్మింగ్ కేంద్రాలను ప్రారంభించారు.
మంచువల్ల రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.గత వారం రోజులుగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 15కు పెరిగింది.సోమవారం అమెరికాలోని మూడోవంతు భూభాగంలో సున్నాకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.డల్లాస్, ఓక్లహోమ్ సిటీ, మిస్సోరి, కాన్సాస్ సిటీల్లో 1989 తరువాత మొదటిసారి అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
టెక్సాస్లో 1898 తరువాత భారీగా మంచు కురవడం ఇది రెండోసారి మాత్రమే.మంచు తుఫానుల వల్ల విమాన రాకపోకలు చాలావరకు నిలిచిపోయాయి.సోమవారం దాదాపు 3,900 విమానాలు రద్దయ్యాయి.మంగళవారం మరో 3,600 విమానాలను రద్దు చేశారు.
రానున్న ఏడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉంది.మంగళవారం సాయంత్రం నాటికి అర్కాన్సాస్ నుంచి న్యూయార్క్ వరకు మొత్తం 6-12 అంగుళాల మేర మంచు రోడ్లపై పేరుకుపోయింది.
దీంతో ప్రభుత్వ యంత్రాంగం మంచు తొలగించే పనుల్లో బిజీగా వుంది.ఈ నేపథ్యంలో అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.