అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్బుక్లు షాకిచ్చాయి.తమ పాలసీలు ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టినందుకు గాను ట్రంప్ ఖాతాను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది.
అటు ట్విట్టర్ సైతం తమ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించమని కోరుతూ.ఖాతాను తాత్కాలికంగా లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్ డీసీలో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల పట్ల ఆధారరహిత వ్యాఖ్యలు చేయడంతో ఫేస్బుక్, ట్విట్టర్లు ట్రంప్పై చర్యలకు ఉపక్రమించాయి.
ఇదే విధంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ను నియామకాన్ని నిలిపివేయమంటూ ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశానికి గాను ట్విట్టర్ 12 గంటలపాటు ఆయన ఖాతాను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది.
అయితే ఆందోళనకారులు సంయనం పాటించాలంటూ ట్రంప్ వీడియో సందేశం విడుదల చేశారు.ఈ వీడియోను ఫేస్బుక్ తొలగించింది.
ఆందోళన దృష్ట్యా వీడియోను తొలగించామని ఫేస్బుక్ వివరణ ఇచ్చింది.
కాగా అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్ధతుదారులు బుధవారం క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే.బ్యారికేడ్లను దాటుకుని వెళ్లి పోలీసులతో ఘర్షణకు దిగారు.భవనంలోని కిటికీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి వీరంగం సృష్టించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్రంప్ మద్దతు దారులను అదుపులోకి చేసేందుకు భద్రతా సిబ్బంది తూటాలకు పనిచెప్పక తప్పలేదు.
పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి చెందగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఈ ఘటనపై ప్రపంచ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
.