అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.ఈ క్రమంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఇరు వర్గాలు వదులుకోవడం లేదు.
ఇప్పుడు తాజాగా పోస్టల్ బ్యాలెట్, ముందస్తు ఓటింగ్పై రెండు పార్టీలు యుద్ధం చేస్తున్నాయి.అధికారికంగా పోలింగ్ జరిగేది నవంబర్ 3నే అయినప్పటికీ.
ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ సాగుతోంది.కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతుండటంతో మెజార్టీ అమెరికన్లు క్యూ లైన్లో నిలబడి ఓటు వేసే కంటే ముందస్తు ఓటింగ్కే మొగ్గు చూపుతున్నారు.
దీంతో ముందస్తు ఓటింగ్ కోసం వీలు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా భారీగా ఓటింగ్ జరుగుతోంది.
అయితే ముందు నుంచి పోస్టల్ బ్యాలెట్లపై విమర్శలు గుప్పించిన ట్రంప్కు.
ఈ విధానం ఆందోళన కలిగిస్తోంది.అందువల్ల ముందస్తు ఓటింగ్ శాతం పెరుగుతున్న కొద్ది, తనకు వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయేమోన్న భయం ట్రంప్లో మొదలైంది.
దీంతో రెండు పార్టీల మధ్య ముందస్తు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వార్ నడుస్తోంది.వీటి ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించాలని ట్రంప్- ఇది ఇంకా ఎక్కువగా సాగాలని బిడెన్ వర్గాలు వ్యూహాలు రచిస్తున్నారు.
దీనిలో భాగంగా తమ కార్యక్షేత్రానికి కోర్టులను వేదికగా చేసుకున్నాయి ఇరు వర్గాలు.రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు కేసులు వేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి.
సాధారణంగా నవంబర్ 3 నాటికి అధికారులకు అందే పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు.కానీ అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో నిబంధనలు ఒకేలా వుండవు.దీంతో ఎన్నిక తేదీ (నవంబర్ 3) తర్వాత ఐదారు రోజుల వరకు అందే పోస్టల్ బ్యాలెట్లను సైతం పరిగణనలోనికి తీసుకోవాలని డెమొక్రాట్లు ఆయా రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారు.తటస్థ ఓటర్లతో… అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లలో ఈ గోల తీవ్రమై పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.
పెన్సిల్వేనియాలో ఎన్నికల తేదీ తర్వాత అందే ఓట్లను కూడా లెక్కించటానికి సుప్రీంకోర్టు అనుమతించింది.దీంతో డెమొక్రాట్లు పండగ చేసుకున్నారు.కానీ విస్కాన్సిన్లో మాత్రం అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది.ఇక్కడ రిపబ్లికన్ల వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.
దీంతో న్యాయస్థానాలు రాబోయే రోజుల్లో ఎలాంటి తీర్పునిస్తాయోననే భయంతో డెమొక్రాట్లు తమ ఓటర్లంతా పోస్టు ద్వారా కాకుండా దగ్గర్లోని పోలింగ్ బాక్సుల్లో ఓట్లు వేయాలని… భారీస్థాయిలో ప్రచారం మొదలెట్టారు.ఎందుకంటే- పోస్టల్ బ్యాలెట్లను సకాలంలో తపాలా శాఖ అందజేయకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు.అమెరికా తపాలా శాఖ ట్రంప్కు అనుకూలంగా పనిచేస్తుందని… కాబట్టి పోస్టల్ బ్యాలెట్లను కావాలని ఆలస్యం చేసే అవకాశం ఉందని డెమొక్రాట్లు ముందు నుంచీ అనుమానిస్తున్నారు.అందుకే… ఎన్నికల తేదీ తర్వాత కొద్దిరోజుల పాటు వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.
పోలింగ్ తేదీ నాడు భారీస్థాయిలో తమ మద్దతుదారులు వచ్చి ఓటు వేసేలా రిపబ్లికన్లు వ్యూహాలు రచిస్తున్నారు.తద్వారా ముందస్తు ఓట్ల ప్రభావాన్ని తగ్గించొచ్చని వారు భావిస్తున్నారు.మరోవైపు ఓట్ల అర్హతపైనా, ఓటింగ్ తీరుపైనా స్థానికంగా ఆయా రాష్ట్రాల్లోని న్యాయస్థానాల్లో వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి.ఫలితాన్ని మరింత సంక్లిష్టం చేసే వ్యూహంలో భాగంగానే పార్టీలు ఇలాంటి చర్యలకు దిగుతాయట.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఫలితం తేలటం అంత ఆషామాషీగా జరిగేలా కనిపించడం లేదు.