వైట్ హౌస్లో కరోనా కలకలం రేగింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్కు కరోనా పాజిటివ్గా తేలింది.
దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇవాంక, ఆమె భర్త జావేద్ కుష్నర్లకు నెగెటివ్ వచ్చింది.అయితే గత కొన్ని రోజులుగా ఆమె ఇవాంకతో లేరని, దీంతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో గత రెండు నెలలుగా ఇవాంక ట్రంప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కేటీ మిల్లర్ అనే మహిళకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది.
ఈమె ట్రంప్ వద్ద కీలక విధులు నిర్వహిస్తోన్న స్టీఫెన్ మిల్లర్ సతీమణి.కేటీ మిల్లర్ వైట్ హౌస్లో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.గురువారం ఆమె పాల్గొన్న ఓ బహిరంగ ప్రార్థనా సమావేశంలో ట్రంప్ సతీమణి మెలానియా, మైక్ పెన్స్ భార్యతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కేటీ మిల్లర్కు పాజిటివ్గా తేలడంతో ట్రంప్, పెన్స్లకు వైట్ హౌస్ వైద్య సిబ్బంది కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.వారిద్దరికీ ఇక నుంచి ప్రతిరోజూ పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు.వైట్ హౌస్ పరిసరాలలో ప్రతిరోజూ క్రిమి సంహారక మందులు స్ప్రే చేయడంతో పాటు, కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించడం వంటి కరోనా జాగ్రత్తలు తప్పనిసరి చేస్తామని వారు వెల్లడించారు.కాగా అమెరికాలో ఇప్పటి వరకు 1.32 మిలియన్ల మంది కరోనా వైరస్ బారినపడగా, 78,200 మంది ప్రాణాలు కోల్పోయారు.