భారత్లో సెకండ్ వేవ్కు కారణమై లక్షలాది మంది బాధితులుగా మారడానికి, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ‘‘డెల్టా వేరియెంట్’’ ఇప్పడు ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇప్పటికే బ్రిటన్లో ఈ రకం వల్ల కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
అక్కడ ప్రతి 11 రోజులకోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది.ఏప్రిల్ నుంచి కోవిడ్ బాధితులు ఆసుపత్రిపాలు కావడం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు.
దీని వల్ల జూన్ 21 నుంచి అమలు చేయాలనుకున్న అన్లాక్ ప్రక్రియను మరో నాలుగు వారాలు వాయిదా వేస్తున్నట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.అక్కడ 10 మంది కోవిడ్ బాధితుల ద్వారా మరో 14 మందికి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
శాంపిల్స్లో 90 శాతం డెల్టా వేరియెంట్కు సంబంధించినవేనని తేలింది.
అటు అమెరికాలోనూ డెల్టా వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
డెల్టా వేరియెంట్ను ఆందోళనకర రకంగా యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వర్గీకరించింది.దీనితో పాటు ఆల్ఫా, బీటా, గామా, ఎప్పిలాన్ రకాలను ఇదే కేటగిరీలోకి చేర్చింది.
డెల్టా వేరియంట్ రకం వ్యాప్తి అత్యంత ఉద్ధృతంగా వుందని, ఇప్పటికే వినియోగంలో వున్న మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలకు సైతం ఈ మహమ్మారి లొంగడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అటు టీకాల సామర్ధ్యం కూడా తక్కువగానే వున్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో డెల్టా వేరియెంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళనకర రకంగా గుర్తించింది.మరోవైపు దేశంలోని పరిస్ధితులను గమనిస్తోన్న అధ్యక్షుడు జో బైడెన్ అప్రమత్తయ్యారు.డెల్టా వేరియెంట్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వైరస్ బారినపడకుండా వుండేందుకు టీకా వేయించుకోవాలని అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.ఇది వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో 300 మిలియన్ల మందికి టీకాలు వేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికాలో పరిస్ధితి అదుపులోకి వస్తోందని బైడెన్ పేర్కొన్నారు.
కాగా, అమెరికాలో ఇప్పుడిప్పుడే విమాన ప్రయాణాలు, వాణిజ్య సంస్థలు, బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ తెరచుకుంటున్నాయి.
చాలా రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలను నెమ్మదిగా తొలగిస్తున్నాయి.ఈ క్రమంలోనే దేశ స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4న ‘‘ కోవిడ్ విముక్తి వేడుకలు’ నిర్వహించాలని బైడెన్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
కోవిడ్పై పోరులో ఎంతో శ్రమించిన ప్రజలు, పలు రంగాలకు చెందిన నిపుణులు, సాయుధ బలగాలతో పాటు వారి కుటుంబ సభ్యులకు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇలాంటి పరిస్ధితుల్లో డెల్టా వేరియెంట్ విజృంభిస్తుండటంతో ఆ రోజు వేడుకలపై ప్రభావం పడే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.