అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక కావడంలో భారతీయుల పాత్ర సామాన్యమైనది కాదు.రిపబ్లికన్ పార్టీని, డొనాల్డ్ ట్రంప్ని కాదని ఆయనకే జై కొట్టింది ఇండో – అమెరికన్ సమాజం.
తనపై భారతీయులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పిన బైడెన్.వారి రుణాన్ని తీర్చుకోవడానికి తన బృందంలో కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటికే తన ఏజెన్సీ సమీక్ష బృందంలో 20 మందిపైనే భారతీయులను నియమించుకున్నారు.
వీరిలో ముగ్గురు టీం లీడర్లు ఉన్నారు.
ప్రస్తుత పాలకవర్గం నుంచి నూతన పాలకవర్గానికి అధికార బదిలీ సజావుగా జరిగేందుకు కీలక ఫెడరల్ ఏజెన్సీ కార్యకలాపాలను ఈ సమీక్ష బృందం పరిశీలిస్తుంది.మొత్తం వంద మంది ఈ సమీక్ష బృందంలో ఉన్నారు.
వీరిలో స్టాన్ఫర్డ్ వర్సిటీకి చెందిన అరుణ్ మజుందార్.ఇంధన విభాగానికి టీం లీడర్గా నియమితులయ్యారు.
అలాగే జాతీయ డ్రగ్ కంట్రోల్ విధాన విభాగానికి రాహుల్ గుప్తా, సిబ్బంది నిర్వహణ విభాగానికి కిరణ్ అహూజాను టీం లీడర్లుగా నియమించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు కొవిడ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిన బైడెన్ అందులో డాక్టర్ వివేక్ మూర్తి, డాక్టర్ అటుల్ గావాండేను నియమించారు.తాజాగా భారత సంతతికి చెందిన నీరా టాండన్కు బైడెన్ కీలక బాధ్యలు అప్పగించారు.మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ టీమ్కు డైరెక్టర్గా ఆమెను నామినేట్ చేశారు.
ఈమె బరాక్ ఒబామా హయాంలో హెల్త్కేర్ అడ్వైజర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.అంతేకాదు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అప్పటి డెమొక్రాటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్కు సలహాదారుగా కూడా పనిచేశారు.
ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వున్నారు.నీరా టాండన్తో పాటు ఈ టీమ్లో ఆర్ధిక వేత్తలు జేర్డ్ బెర్న్స్టైన్, హీతర్ బౌషేను కూడా బైడెన్ నామినేట్ చేయనున్నారు.
వీరితో మరో ఆర్ధికవేత్త వాలీ అడేమోను కూడా బైడెన్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.