అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం లో ఎలాంటి మార్పు మాత్రం కనిపించడం లేదు.ఒకపక్క కరోనా కేసులతో అతలాకుతలం అవుతున్నప్పటికీ అగ్రరాజ్యాధినేత వ్యవహరించే తీరు విమర్శలకు దారి తీస్తుంది.
మొన్నటికి మొన్న భారత్ సాయం కోరిన ట్రంప్ భారత్ సానుకూలంగా స్పందించకుంటే ప్రతీకార చర్యలు తీసుకొనేవారం అంటూ నోరు జారిన అంశం విమర్శల పాలైన విషయం తెలిసిందే.కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తుండడం తో ట్రంప్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించినంతగా రావడం లేదు.
దానికి తోడు రాబోయే రోజుల్లో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురుకాబోతున్నట్లు విశ్లేషకులు కూడా హెచ్చరించడం తో ట్రంప్ సర్కార్ మరింత ఆందోళన చెందుతుంది.ఈ క్రమంలో భారత్ ను హైడ్రాక్సి క్లోరోక్వీన్ ను అందించాలి అంటూ కోరగా,దానికి భారత్ కూడా అంగీకరించింది.
అయితే భారత్ ఒకేవేళ సానుకూలంగా స్పందించకుంటే ప్రతీకార చర్యలు తీసుకునేవారమి అంటూ ట్రంప్ నోరు జారడం కూడా తీవ్ర విమర్శల పాలైంది.అయితే భారత్ పై ట్రంప్ నోరు జారిన అంశం ఇంకా మరువక ముందే డబ్ల్యూ హెచ్ ఓ పై ట్రంప్ విమర్సలు గుప్పించడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
డ్రాగన్ దేశం చైనా కు అనుకూలంగా డబ్ల్యూ హెచ్ ఓ వ్యవహరిస్తోంది అంటూ ట్రంప్ ఆరోపించారు.వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో దాని తీవ్రత గురించి డబ్ల్యూహెచ్ఓ వద్ద సమాచారం ఉన్నా పంచుకోవడానికి ఇష్టపడలేదని,కరోనా మహమ్మారి విషయంలో చాలా తప్పటడుగులు వేసిందంటూ మండిపడ్డారు.
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అక్కడ పర్యటించిన విదేశీయులు తమ దేశంలోకి రాకుండా జనవరి 31న నిషేధం విధిస్తే డబ్ల్యూహెచ్ఓ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.ఇది అతిపెద్ద తప్పుడు నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూహెచ్ఓకే తామే అత్యధికంగా నిధులు సమకూరుస్తున్నామని, ఇప్పుడు ఆ నిధుల్ని నిలిపివేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు.అయితే, డబ్ల్యూహెచ్ఓపై ట్రంప్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు.
గతంలో కూడా ట్రంప్ అనేక సార్లు WHO పై విమర్శలు చేశారు.
డబ్ల్యూహెచ్ఓకు 58 నుంచి 122 మిలియన డాల్లర్ల మేర నిధులు కేటాయించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ట్రంప్ తాజా నిర్ణయం తో మరి ఆ నిధులు WHO కు అందుతాయా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.ఇదిలా ఉండగా.
కొవిడ్-19పై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తున్న తీరుపై సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్ జిమ్ రిష్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ విషయంలో డబ్య్లూహెచ్ఓపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలుస్తుంది.
ఒక్క అమెరికానే కాదు ప్రపంచదేశాల్ని డబ్ల్యూహెచ్ఓ తప్పుదారి పట్టించిందని రిష్ ఆరోపిస్తున్నారు.