సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ చేస్తే చాలు వెంటనే అది వైరల్ గా మారిపోతుంది.
అయితే ఇలాంటి సోషల్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలు చేసారు.సోషల్ మీడియా ప్రజలను దారుణంగా చంపేస్తోందని అంటున్నారు.
ఎందుకంటే సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురించి, కరోనా వ్యాక్సిన్ల పై వచ్చే అసత్య ప్రచారం పట్ల బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా అసత్య ప్రచారాలు చేయడం వలన అన్యాయంగా ప్రజలు చనిపోతున్నారు అంటున్నారు.
అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి బైడెన్ ను కరోనా టీకాలపై ఫేస్బుక్ లో అసత్య ప్రచారం జరుగుతుంది అని, దీనిపై మీరు ఎలా స్పందిస్తారని అడగగా బైడెన్ ఇలా ఘాటుగా స్పందించారు.
సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు వైట్ హౌస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు.
ఇలాంటి అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవడం సరైన పద్ధతి కాదని బైడెన్ అన్నారు.అలాగే ప్రతి ఒక్కరు వ్యాక్సీన్ వేసుకోవాలని అలా వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని అన్నారు.
అయితే బైడెన్ కంటే ముందే వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం కావడంపై వివేక్ మూర్తి గురువారమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.దీన్ని ఆయన ‘ఇన్ఫోడెమిక్’గా పేర్కొన్నారు.భారత్, యూఎస్ లో కలిపి మొత్తం ఆయన 10 మంది కుటుంబ సభ్యులను కరోనా వైరస్ వలన కోల్పోయినట్లు తెలిపారు.అందుకే కరోనా నుంచి తప్పించుకోవాలంటే త్వరగా అందరూ టీకాలు తీసుకోవాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికగా వ్యాక్సిన్ల పై అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు అని అన్నారు.
ఇది ఇలా ఉండగా ఈ ప్రచారంపై ప్రముఖ సోషల్ మీడియా అయిన ఫేస్బుక్ బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా తప్పుడు ఆరోపణలు మా సంస్థపై ఎలా చేస్తారని మండిపడింది.ప్రజలను రక్షించే ఉద్దేశంతోనే కోవిడ్ కు సంబందించిన సమాచారం అందుబాటులో ఉంచుతున్నాం అని, మేము అందుబాటులోకి తెచ్చిన వాక్సిన్ ఫైండర్ టూల్ ద్వారా వాక్సిన్ ఎప్పుడు ఎక్కడ దొరుకుంతుందనే వివరాలను తెలుసుకోవడానికి ఈ టూల్ ను 33 లక్షల మంది అమెరికన్లు ఉపయోగించిన విషయం ఒకసారి గుర్తుచేసుకోవాలని కోరింది.
అంతేకాకుండా ప్రాణాలను కాపాడడంలో ఫేస్ బుక్ ఎప్పుడు సహాయపడుతుందని వివరణ ఇచ్చింది.