ఏడాదిన్నర పాటు దేశాన్ని వణికించిన కరోనా రక్కసి నుంచి అమెరికా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.కఠిన ఆంక్షలు, వ్యాక్సినేషన్, వైద్య సదుపాయాల పెంపు తదితర చర్యలు అగ్రరాజ్యంలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏడాదిన్నరగా మాస్క్లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన సీడీసీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.రెండు డోస్ల వ్యాక్సిన్ పూర్తయిన వారు ఇకపై బహిరంగ, అంతర్గత కార్యకలాపాల్లో పాల్గొన్న సమయంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించాల్సిన అవసరం లేదని సీడీసీ తెలిపింది.
అయితే ఈ నిర్ణయం అమెరికాలో గందరగోళానికి కారణమైంది.మాస్క్లు ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని కొందరుంటే.
అమ్మ బాబాయ్ ఇంకా ముప్పు తొలగిపోలేదు కదా అని మరికొందరు ముసుగు తీయడానికి జంకుతున్నారు.
ఒక వ్యక్తికి రెండు టీకాలు పూర్తయినట్లు ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎదుటి వ్యక్తికి సైతం ఆ వ్యక్తికి రెండు టీకాలు తీసుకున్నట్లు తెలియదు కదా అని నిలదీస్తున్నారు.సీడీసీ నిర్ణయంతో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతారని మండిపడుతున్నారు.
దీని వల్ల దేశం మరోసారి ప్రమాదంలో పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కోవిడ్ వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా 5,80,000 మంది ప్రాణాలు కోల్పోయి.అంతులేని నష్టాలను చవిచూసిన దేశంలో ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్న జాగ్రత్తల్ని ఉన్నపళంగా విడిచిపెట్టడానికి చాలా మంది సిద్ధంగా లేరు
తాజాగా సీడీసీ ప్రకటనను అమెరికాలోని నర్సుల యూనియన్ తప్పుబట్టింది.ఇలాంటి నిర్ణయం ప్రమాదకరమని హెచ్చరించింది.సీడీసీ ప్రకటన వల్ల ఫ్రంట్లైన్ వర్కర్లతో పాటు ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.సీడీసీ చేసిన సిఫార్సు సైన్స్ ఆధారంగా జరగలేదని వారు అభిప్రాయపడ్డారు.
దేశంలో కోవిడ్ రక్షణకు సంబంధించిన చర్యలను సడలించడానికి ఇది సమయం కాదని హితవు పలికారు.అమెరికాలో ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొందరిపై వైరస్ మరోసారి దాడి చేస్తోందని గుర్తుచేశారు.