అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అమెరికా, చైనాలు యుద్ధం చేసే పరిస్థితులు ఉన్నాయని ట్రంప్ ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల హాడావిడి పెరుగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రస్తుతం అమెరికాను అవినీతి, బలహీన ప్రభుత్వం పాలిస్తోందని, ఈ ప్రభుత్వాన్ని డ్రాగన్ గుర్తించడం లేదని ఆయన చురకలు వేశారు.
అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిజమైన విజయం తనదేనని.అప్పుడు రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ మళ్లీ ఆరోపించారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి నాటో, అమెరికా సేనలను ఉపసంహరించుకున్న సమయంలో 8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను వదిలేసి రావడంపై ట్రంప్ మాట్లాడుతూ.చైనా, రష్యాలు ఇప్పుడా పరికరాలను రివర్స్ ఇంజినీరింగ్ ద్వారా సొంతంగా తయారుచేసుకుంటాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు తైవాన్ను తన దారికి తెచ్చుకోడానికి డ్రాగన్ దూకుడును మరింత పెంచింది.వరుసగా గత నాలుగు రోజుల నుంచి భారీగా యుద్ధ విమానాలను పంపుతూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
గత శుక్ర, శనివారాల్లో మొత్తం 77 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టగా, ఆదివారం16 విమానాలు, సోమవారం మరో 56 యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి వచ్చినట్లు తైవాన్ రక్షణశాఖ ప్రకటించింది.
ఇక, గత శుక్రవారం నుంచి తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధవిమానాలు రావడంపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రాంతీయ స్థిరత్వం, ప్రశాంతతకు భంగం కలిగించొద్దంటూ బీజింగ్కు పెద్దన్న హితవు పలికింది.ప్రాదేశిక శాంతి, స్థిరత్వాలకు విఘాతం కలిగించేలా చైనా వ్యవహరిస్తోందంటూ అగ్రరాజ్యం మండిపడింది.
తైవాన్పై సైనిక, దౌత్య, ఆర్థిక ఒత్తిడిని, బలవంతపు చర్యలను చైనా ఆపాలి అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో సూచించింది.అదే సమయంలో తైవాన్కు పూర్తిగా అండగా వుంటామని అమెరికా స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే చైనాపై అమెరికా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ట్రంప్ ఖండించారు.అసలే ఆఫ్ఘన్ పరిణామాలతో బైడెన్ ఇంటా బయటా అప్రతిష్టను మూటకట్టుకున్నారు.
ఈ పరిస్ధితుల్లో తైవాన్ వ్యవహారాన్ని ఆయన ఎలా డీల్ చేస్తారా అని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.