కరోనా మహమ్మారి కారణంగా గతేడాది అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ సైతం ఈ ఆంక్షలను యథావిధిగా కొనసాగించారు.
అటు కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది అగ్రరాజ్యం.అయితే ప్రస్తుతం మనదేశంలో కోవిడ్ అదుపులోకి వస్తుండటంతో పలు దేశాలు ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి.
ఇప్పటికే యూఏఈ, బ్రిటన్లు భారతీయులను తమ దేశం రావడానికి అనుమతిస్తున్నాయి.తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా భారతదేశంపై వున్న ఆంక్షలను సడలించింది.
అలాగే వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని జోబైడెన్ సర్కార్ నిర్ణయించింది.వాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని వైట్హౌస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎఫ్డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం పొందిన టీకాలను వేసుకున్న వారిని అనుమతించనున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
తాజాగా భారతీయులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది.భారత విమాన ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.దాని స్థానంలో కొత్తగా మార్గదర్శకాలు, నిబంధనలను అమలులోకి తీసుకురానుంది.
నవంబర్ 8వ తేదీ నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.భారత్, చైనా సహా మొత్తం 33 దేశాలపై విధించిన కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా.
కొత్తగా రూపొందించిన గైడ్లైన్స్పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారని వైట్హౌస్ వెల్లడించింది.ఈ కొత్త మార్గదర్శకాలను విదేశీ పౌరులకు మాత్రమే కాకుండా.
ఆయా దేశాల్లో నివసిస్తోన్న తమ సొంత ప్రజలకు కూడా వర్తింపజేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.నవంబర్ 8వ తేదీ తరువాత తమ స్వదేశానికి వచ్చే అమెరికన్లు ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుంది.
ఇక భారత్, చైనా ఇతర 33 దేశాలకు చెందిన పౌరులు.రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలి.అలాగే మూడురోజుల పాటు చెల్లుబాటయ్యేలా కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్ను అందజేయాల్సి ఉంటుంది.అయితే రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారికి తమ దేశానికి రావడానికి అనుమతి ఉండదని అమెరికా స్పష్టం చేసింది.