అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ తరపు నుంచి బరిలో దిగిన జో బిడెన్కు మద్ధతుదారుల సంఖ్య పెరుగుతోంది.ఇప్పటికే వివిధ రంగాల ప్రముఖల సపోర్ట్ అందుకున్న ఆయనకు తాజాగా భారత సంతతికి చెందిన అగ్రశ్రేణి మాజీ అధికారులు జై కొట్టారు.
వీరంతా బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో కీలక పదవులు నిర్వర్తించారు.
వీరిలో భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ, దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల మాజీ సహాయ కార్యదర్శి నిషా దేశాయ్ బిస్వాల్, అమెరికా మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనీశ్ చోప్రా, మాజీ డిప్యూటీ వైట్ హౌస్ కేబినెట్ కార్యదర్శి గౌరవ్ బన్సాల్, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ ఆహుజా, సీమా నందా, సోనాల్ షాతో పాటు పలువురు ఆసియా అమెరికన్లు ఉన్నారు.
తామంతా ఒబామా పాలనలో ఉపాధ్యక్షుడితో కలిసి పనిచేశామని వారు తెలిపారు.20 మిలియన్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను పొందేందుకు వీలుగా ఉద్దేశించిన చట్టాన్ని రూపొందించడంలో జో బిడెన్ కీలకపాత్ర పోషించారని ఇండో అమెరికన్ అధికారులు గుర్తుచేసుకున్నారు. ఆర్ధిక మాంద్యం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినప్పుడు ఆయన చురుగ్గా వ్యవహరించారని సంయుక్త ప్రకటనలో ప్రస్తావించారు.ప్రధానంగా బిడెన్ రాజనీతి, నిజాయితీలు, నిబద్ధతను తాము ప్రత్యక్షంగా చూశామని అందువల్ల ఆయన అమెరికన్లందరికీ సమాన అవకాశాలను కల్పిస్తారని బలంగా విశ్వసిస్తున్నట్లు వీరు చెప్పారు.ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో జో బిడెన్ లాంటి వ్యక్తులే దేశాన్ని నడిపించగలరని వారు అభిప్రాయపడ్డారు.
77 ఏళ్ల జో బిడెన్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్దిగా ఆగస్టులో విస్కాన్సిన్ల జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ ద్వారా అధికారికంగా నామినేట్ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే బిడెన్ ప్రత్యర్ధులు బెర్నీ శాండర్స్, ఎలిజబెత్ వారెన్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసిలు ఆయనకు మద్ధతు ప్రకటించిన సంగతి తెలిసిందే.