వృత్తి, ఉద్యోగాల కోసం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడిన వారు గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూడటం సర్వసాధారణం.గతంలో నిర్ణీత కాలవ్యవధి పాటు అమెరికాలో నివసించిన వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడి అధికారులు గ్రీన్కార్డ్ మంజూరు చేశారు.
అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు వచ్చాయి.
అమెరికా ఫస్ట్ నినాదంతో ఆయన దూకుడైన నిర్ణయాలు తీసుకోవడంతో వలసదారులకు ఇబ్బందులు తలెత్తాయి.లాటరీ పద్ధతిలో వీసాలకు సైతం ఆయన కోత పెట్టారు.అంతేకాకుండా పలు దేశాల వారు అమెరికాపై పడి తింటున్నారని అగ్రరాజ్యాధినేత నిష్టూరంగా మాట్లాడారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గ్రీన్కార్డు పొందాలనుకునే వారికి అమెరికా సెనెట్ శుభవార్త చెప్పింది.
గ్రీన్కార్డ్ పొందాలని వివిధ దేశాల్లో ఎదురుచూస్తున్న వారికి 7 శాతం కోటా నిబంధన అడ్డంకిగా మారడంతో దానిని తొలగిస్తూ సెనెట్ తీర్మానం చేసింది.తద్వారా హెచ్1బీ వీసా వున్న వారికి అమెరికాలో శాశ్వత నివాసం మరింత సులువు కానుంది.ముఖ్యంగా భారతీయులకు ఇది మరింత మేలు చేస్తుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు.
ఇప్పటి వరకు 7 శాతం నిబంధనం ఉండటంతో ఏడాదికి 26,000 మంది భారతీయులకు మాత్రమే గ్రీన్ కార్డులు అందేవని కానీ ఇప్పుడు ఆ నిబంధన ఎత్తివేయడంతో మరింత మందికి లబ్ధి కలుగుతుందని పలువురు ఎన్ఆర్ఐలు అంటున్నారు.
ది ఫెయిర్నెస్ ఫర్ హైస్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ చట్టం 2019 ప్రకారం 7 శాతం నిబంధన తొలగటంతో దాదాపు 85 శాతం మంది భారతీయులకు తొలి రెండేళ్లలో గ్రీన్కార్డులు లభించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్స్ ఆమోదం పొందింది.సెనేట్ ఆమోదం పొందాక ట్రంప్ సంతకం చేస్తే చట్టంగా రూపొందనుంది.అగ్రశ్రేణి అమెరికా కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్లు ఈ బిల్లు పట్ల సానుకూలంగా ఉన్నాయి.