భారతీయుల పర్వదినం దీపావళిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.అగ్రరాజ్యం అమెరికాలో సైతం దీపావళి వెలుగులతో, బాణాసంచా కాల్పులతో ధగధగలాడిపోతోంది.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలపై తొలిసారిగా దీపావళి థీమ్ని ప్రదర్శించారు.న్యూయార్క్లోని హడ్సన్ నదీ తీరంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు.
ఇక్కడ మూడు రోజుల పాటు దీపావళీ వేడుకలు జరగనున్నాయి.అలాగే ప్రపంచ నలుమూలలా ఉన్న భారతీయులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
అంతేకాకుండా స్వయంగా శ్వేతసౌధంలో దీపాలు వెలిగించిన ఫొటోను షేర్ చేసుకున్నారు.అటు అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్ కూడా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.వాషింగ్టన్ డీసీలోని నేషనల్ డెమొక్రాట్ క్లబ్లో దీపావళిని ఘనంగా నిర్వహించారు.అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె సాంప్రదాయ భారతీయ దీపాన్ని వెలిగిస్తున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
కాంగ్రెస్ సభ్యుడు రిచర్డ్ నీల్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.చికాగోకు చెందిన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్ డాక్టర్ విజయ్ జీ ప్రభాకర్ మాట్లాడుతూ.
అమెరికాలో మూడవ అత్యున్నత అధికారి అయిన నాన్సీ పెలోసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా వుందన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లినాయిస్ స్టేట్ హౌస్ స్పీకర్, సిటీ ఆఫ్ చికాగో కౌన్సిల్, కుక్ కౌంటీ కోశాధికారి, నేషనల్ కౌన్సిల్ ఆన్ వైట్హౌస్ హిస్టరీ సభ్యుడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మరోవైపు అమెరికాలో దీపావళిని జాతీయ పండుగగా గుర్తించి సెలవు ప్రకటించాలని ఎంతో కాలంగా భారతీయులు కోరుతున్నారు.ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధుల సభ్యురాలు కెరోలిన్ చట్టసభలో ఓ కొత్త బిల్లు ప్రవేశపెట్టారు.ఆమెతో పాటు భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణ మూర్తి, విదేశీ వ్యవహారా కమిటీ ఛైర్మెన్ గ్రెగరీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.ఈ బిల్లు గనుకా చట్టరూపం దాల్చితే ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు దీపావళిని సెలవు దినంగా ప్రకటించే అవకాశం ఉంది.