గడిచిన కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికా, కెనడాలను ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ప్రతిరోజూ సుమారు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇక ఇదే సమయంలో అడవుల్లో కార్చిచ్చులు రేగుతున్నాయి.ముఖ్యంగా పశ్చిమ అమెరికాలో కార్చిచ్చులు ప్రజలకు కంటి మీద కునుకు లేదకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే ఎండ, వేడిగాలులతో అల్లాడుతున్న జనానికి ఈ కార్చిచ్చులతో ఊపిరి ఆడటం లేదు.విపత్కర పరిస్థితుల్లో మంటలను అదుపు చేసేందుకు గాను కమ్యూనిటీలను ఖాళీ చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.
కాలిఫోర్నియాలో అంతర్రాష్ట్ర విద్యుత్ లైన్లకు అంతరాయం కలగడంతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ పరిస్ధితుల్లో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.
ఈ క్రమంలో శనివారం అరిజోనాలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు వెళుతూ విమానం కూలిపోవడంతో మరణించారు.నెవాడాలోని లాస్ వేగాస్లో శనివారం ఉష్ణోగ్రతలు ఆల్టైమ్ రికార్డులను తిరగరాశాయి.ఆ రోజున 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.వాతావరణం పొడిగా వుండటంతో, విమానాల నుంచి నీటిని మంటలపై స్ప్రే చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ నీరు భూమిని చేరేలోగా ఆవిరైపోతోంది.ఈయూ ఎర్త్ అబర్జర్వేషన్ అంచనా ప్రకారం.జూన్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.వాతావరణంలో మార్పులు హీట్ వేవ్స్ వంటి వాతావరణ సంఘటనల ఫ్రీక్వెన్సీని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆరిజోనాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన అగ్నిమాపక సిబ్బందికి ఆరిజోనా బ్యూరో ఆఫ్ లాండ్ మేనేజ్మెంట్ నివాళులర్పించింది.ఈ ప్రమాదం కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు సంతాపం తెలిపింది.వికీ అప్ అనే చిన్న కమ్యూనిటీకి సమీపంలో శనివారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
కాలిఫోర్నియాకు సరిహద్దు రాష్ట్రమైన నెవాడాకు ఉత్తరాన వున్న సియెర్రా నెవాడా అటవీ ప్రాంతంలో పిడుగుపాటు వల్ల మంటలు చెలరేగడంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లాస్ ఏంజిల్స్ టైమ్స్ ప్రకారం.శుక్ర, శనివారాల్లో భారీగా మంటలు, పొగ, బూడిద ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.ఒరెగాన్లో ఫ్రీమాంట్-వైన్మా నేషనల్ ఫారెస్ట్లో కార్చిచ్చుకు బలమైన గాలులు తోడు కావడంతో అది రెట్టింపు వేగంతో అడవిని దహించి వేసింది.దాదాపు 120 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైనట్లు అధికారులు తెలిపారు.
కాలిఫోర్నియనాకు విద్యుత్తును సరఫరా చేసే కేబుల్స్ మంటల వల్ల దెబ్బతిన్నాయి.కాలిఫోర్నియాలోని పవర్ గ్రిడ్ ఆపరేటర్లు తమ యంత్రాల వాడకాన్ని తగ్గించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలని ప్రజలను కోరుతున్నారు.కార్చిచ్చు నేపథ్యంలో ఇదాహో గవర్నర్ బ్రాడ్ లిటిల్ గత వారం రాష్ట్రంలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.నేషనల్ వెదర్ సర్వీస్ ప్రాథమిక సమాచారం ప్రకారం.నెవాడా, కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి.అలాగే తీవ్రమైన వేడి కొనసాగుతుందని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరించింది.