టెక్సాస్ కాల్పుల ఘటన తర్వాత అమెరికాలో తుపాకుల వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో ప్రఖ్యాత ఆయుధ సంస్థ కోల్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది.అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఏఆర్-15 రైఫిల్ తయారీని నిలిపివేసింది.
కంపెనీ ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నీస్ వెయిలెక్స్ మాట్లాడుతూ.ఏఆర్ రైఫిల్స్ మార్కెట్లో తగినంతగా ఉన్నాయని, ప్రజల క్షేమం దృష్ట్యా వీటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక మీదట మిలటరీ కాంట్రాక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెడతామని తెలిపారు.రివాల్వర్లు, పిస్టోళ్ల తయారీ, సప్లైల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని డెన్నీస్ వెయిలెక్స్ స్పష్టం చేశారు.
కోల్ట్ గత 180 సంవత్సరాలకు పైగా వినియోగదారుల మన్ననలు పొందుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ తుపాకీలను అందిస్తోందని ఆయన తెలిపారు.
అమెరికా సైన్యం వద్ద ప్రత్యేకంగా కనిపించే ఏఆర్ రైఫిల్ అంటే ఆ దేశ యువతకు ఎంతో క్రేజ్.దీనికి క్యాష్ చేసుకునేందుకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి మార్కెట్లో అందుబాటులోకి ఉంచారు.ఇప్పుడు అదే తుపాకీ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.2015 శాన్ బెర్నార్డినో, 2012 అరోరా సినిమా థియేటర్, శాండీ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పులకు ఉన్మాదులు ఉపయోగించిన ఆయుధం ఇదే.
అమెరికాలో సుమారు 50 లక్షల మంది వద్ద ఈ ఏఆర్ రైఫిల్ ఉంది.ఓర్లాండో ఘటనలో ఈ తుపాకీని ఉపయోగించిన నిందితుడు ఒక్క నిమిషంలోనే 45 తూటాలు పేల్చాడు.సాధారణ రకం రూ.30 వేలల్లో లభిస్తుండగా.ఆధునిక ఫీచర్లు ఉన్న తుపాకీకి రూ.60 వేల వరకు ఉంటుంది.ప్రతి ఏటా దీనిని 3 లక్షల మంది వరకు కొంటున్నట్లు అంచనా.