కరోనా వైరస్.ఈ మూడక్షరాల పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.
ఆ రంగం ఈ రంగం అని కూడా లేకుండా అన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే.దేశాలకు దేశాలే సరిహద్దులను మూసివేసి, లాక్డౌన్లు చేసేస్తున్నాయి.
ఏ వ్యాధినైనా కనిపెట్టడం ద్వారానే దానికి సరైన చికిత్సను అందించగలం.ఇప్పుడు కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే వ్యాధి నిర్థారణ అత్యవసరం.
కానీ ఇది అనుకున్నంత తేలిక కాదు.సరైన వైద్య సౌకర్యాలు లేని మనదేశం లాంటి దేశాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరం.ప్రతిరోజూ వందల మందికి వైద్య పరీక్షలు చేయాల్సి రావడం.ఫలితాలు రావడానికి 36 నుంచి 48 గంటల సమయం పడుతోంది.
దీంతో బాధితుల్ని గుర్తించి, వైరస్ను వ్యాప్తి చేయడంలో జాప్యం జరుగుతుండటంతో పుణ్యకాలం గడిచిపోతోంది.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ను వేగంగా గుర్తించే విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు.
దీని వల్ల కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుస్తోంది.
కాలిఫోర్నియాలోని సెఫైడ్ అనే వైద్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు దీనిని అభివృద్ధి చేశారు.ఈ విధానానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శనివారం ఆమోదముద్ర వేసింది.మార్చి 30 నాటికి దీనిని ఉపయోగంలోకి తీసుకోస్తామని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ అజర్ ప్రకటించారు.
బాధితుడు ఉన్న ప్రాంతానికే ఈ పరికరాన్ని తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు.ఈ విధానం వల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సులభం అవుతుంది.అంతేకాకుండా రోగి నమూనాల్ని సేకరించి ప్రయోగశాలకు పంపాల్సిన అవసరం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అమెరికాలో కరోనా కారణంగా మృతుల సంఖ్య 419కి చేరగా, బాధితుల సంఖ్య 33,546కి పెరిగింది.
చైనా, ఇటలీ తర్వాత కరోనా బారినపడిన వారు ఇక్కడే వున్నారంటే పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వైద్య పరికరాల కొరత, వైద్య సేవలు అందకపోవడం వంటి ఇబ్బందులు అమెరికాకు సైతం తప్పడం లేదు.