భారతదేశం ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ప్రపంచంలోని ఎన్నో దేశాలకు భారత్ నుంచి మందులు ఎగుమతి అవుతాయి.
కోవిడ్ సమయంలో భారతీయ ఫార్మా సత్తా ఏంటో ప్రపంచానికి బాగా తెలిసిందే.కోవిడ్ టీకా ఫార్ములాను కనుగొన్న పలు దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు.
వాటి ఉత్పత్తి కోసం మనదేశంలోని దిగ్గజ ఔషధ తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాయి.సీరమ్, డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్, జైడస్ కాడిల్లా, సిప్లా వంటి సంస్థలు కోవిడ్ మందుల తయారీ, పంపిణీ పనులను చేపట్టడం వల్లే కోట్లాది మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో భారత్లో కరోనా వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని పెంచే వనరులు, నిధులు, యంత్రాలను అందించేందుకు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి.ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అందరికంటే ముందే వుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం ‘‘ బయోలాజికల్ ఈ ’’ కార్యాలయాన్ని అమెరికాకు చెందిన ప్రతినిధి బృందం త్వరలో సందర్శించనుంది.టీకా తయారీని గణనీయమైన సామర్ధ్యంతో పెంచే కొత్త సదుపాయాన్ని తెరిచేందుకు గాను సంతకం చేయనుంది.
యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (డీఎఫ్సీ) అనేది ఒక స్టేట్ రన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ.దిగువ, మధ్య ఆదాయ దేశాలలో అభివృద్ధి ప్రాజెక్ట్లలో పెట్టుడులు పెడుతుంది.
డీఎఫ్సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డేవిడ్ మార్చిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అక్టోబర్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో పర్యటించనుంది.
క్వాడ్ దేశాల పరస్పర సహకారంలో భాగంగా తాము హైదరాబాద్కు వస్తున్నట్లు డీఎఫ్సీ ఓ ప్రకటనలో తెలిపింది.తొలుత అక్టోబర్ 18న మార్చిక్ బృందం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుంది.అక్కడి నుంచి భారతదేశ పర్యటనకు వెళ్తారు.ఈ ప్రతినిధి బృందంలో మార్చిక్తో పాటు డీఎఫ్సీ వైస్ ప్రెసిడెంట్ జిమ్ పోలాన్, ఇతర డీఎఫ్సీ సీనియర్ సిబ్బంది వుంటారు.