అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే.ఆయన వెంట భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, అల్లుడుతో పాటు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
వీరితో పాటు ఆయన బృందంలో ఇద్దరు భారత సంతతి ప్రముఖులు కూడా స్థానం సంపాదించారు.అమెరికాలో శక్తివంతమైన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ ఛైర్మన్ అజిత్ పై, జాతీయ భద్రతా మండలి అధికారి కాష్ పటేల్ ట్రంప్తో పాటు సోమవారం తమ మాతృదేశానికి రానున్నారు.
అజిత్ పై తల్లిదండ్రులు ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు వృత్తిరీత్యా డాక్టర్లైన వీరిద్దరూ 1971లో యూఎస్కు వలస వచ్చారు.పై అమెరికాలోని కాన్సాస్లో జన్మించారు.ప్రతిష్టాత్మక హార్వర్డ్, చికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన ఆయన న్యాయవాదిగా మారారు.అమెరికాలో కమ్యూనికేషన్ చట్టాలు, నిబంధనలను నియంత్రించే స్వతంత్ర సంస్థ అయిన ఎఫ్సీసీలో 2012లో చేరిన అజిత్ పై ఐదుగురు సమాచార కమీషనర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వర్తించారు.2017లో డోనాల్డ్ ట్రంప్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమీషన్ ఛైర్మన్గా పై ను నియమించారు.ఈ కాలంంలో నెట్ న్యూట్రాలిటీపై తన వ్యతిరేకతను ఆయన బహిరంగంగానే తెలిపారు.
ఇక మరో వ్యక్తి కాష్ పటేల్ న్యూయార్క్లో జన్మించారు.గుజరాత్కు చెందిన ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా, కెనడా నుంచి అమెరికాకు వలసవచ్చారు.2016లో ట్రంప్ విజయం సాధించడంలో రష్యా జోక్యం చేసుకుందన్న దర్యాప్తును ఖండించడంలో పటేల్ ఇటీవల వార్తల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.ఆయన 2018లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అలయన్స్లో చేరారు.
దీనిలో భాగంగా ఉగ్రవాద నిరోధక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు.ఈ వారం ప్రారంభంలో ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగానికి డైరెక్టర్గా నియమితులయ్యారు.
అంతకు ముందు ఆయన హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో రిపబ్లికన్ల తరపున పనిచేశారు.సోమవారం ఉదయం ఎయిర్ఫోర్స్ వన్ నేరుగా అహ్మదాబాద్లో దిగనుంది.
విమానాశ్రయం నుంచి మోటెరా స్టేడియం వరకు ట్రంప్కు భారీ స్వాగత ఏర్పాట్లను చేశారు.అక్కడ జరిగే నమస్తే ట్రంప్ ఈవెంట్లో అగ్రరాజ్యాధినేత పాల్గొంటారు.