‘‘ పైన పటారం, లోన లొటారం’’ అన్నట్లుగా వుంది అమెరికా పరిస్థితి. శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక, సైనిక, వాణిజ్యం ఇలా రంగమేదైనా అమెరికా తిరుగులేని శక్తి అని, ధనిక దేశాల్లో ఒకటి అని అందరూ అనుకుంటూ వుంటారు.
కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.సంపన్న దేశంగా వున్న అమెరికాకి అప్పులు కూడా ఎక్కువే.
ఈ విషయాన్ని స్వయంగా ఆదేశానికి చెందిన చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ చెప్పారు.దేశంలో కోవిడ్పై పోరు, ప్రజలకు ఆర్ధిక సాయం, ఆర్ధిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు జో బైడెన్ ఉద్దేశించిన రెండు ట్రిలియన్ డాలర్ల కరోనా ఉద్దీపన పథకాన్ని వ్యతిరేకిస్తూ మూనీ ఈ చిట్టా బయటపెట్టారు.
2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయని మూనీ తెలిపారు.దీని ప్రకారం ఆ దేశంలో ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు వివరించారు.గతేడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కో అమెరికన్కూ పంచితే 10,000 డాలర్లు వస్తుందని మూనీ చెప్పారు.
అయితే వివిధ దేశాలు, ఫైనాన్స్ సంస్థల వద్ద నుంచి తీసుకొచ్చిన రుణాలు ఎక్కడికి వెళుతున్నాయనే వివరాల్లో తప్పుడు సమాచారం ఉందని అలెక్స్ ఆరోపించారు.అమెరికా అప్పుల్లో చైనా, జపాన్ల నుంచి తీసుకున్నదే సింహభాగమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ రెండు దేశాల్లో ఒక్కోదానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా బాకీపడి ఉందని మూనీ తెలిపారు.ఇదే సమయంలో భారత్కు ఏకంగా 216 బిలియన్ డాలర్లను రుణపడి ఉందట.
2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు బరాక్ ఒబామా హయాంలో రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు.దీన్ని రోజురోజుకీ పెంచుతూ పోతున్నామని.దీంతో జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని అలెక్స్ మూనీ హెచ్చరించారు.అందువల్ల కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు తాను చెప్పిన అంశాలు పరిగణనలోనికి తీసుకోవాలని తోటి సభ్యులను కోరారు.అంతేకాకుండా ఈ ఉద్దీపన పథకానికి కేటాయించే నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లవంటూ మూనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.