కరోనాతో ఈ భూమ్మీద తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుందంటే అది అమెరికానే.అన్ని రంగాల్లో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు మూడు చెరువుల నీళ్లు తాగించింది కోవిడ్.
ట్రంప్ ఉదాసీన వైఖరితో లక్షలాది మంది అమెరికన్లు మూల్యం చెల్లించుకున్నారు.కోవిడ్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో పీక్స్ను చూసిన అమెరికన్లు.
సెకండ్ వేవ్లో అంతకుమించిన బాధలు అనుభవిస్తున్నారు.ప్రతిరోజూ రెండు లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు, రెండున్నర వేల పైచీలుకు మరణాలతో అమెరికా అల్లాడుతోంది.
ఫైజర్, మోడెర్నా టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి తీసుకున్న పలువురు అస్వస్థకు గురికావడంతో అమెరికన్లలో ఆందోళన నెలకొంది.ఇలాంటి పరిస్ధితుల్లో అంటు వ్యాధుల నిపుణుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆంటోనీ ఫౌచీ దేశ ప్రజలకు మరో చేదు వార్త చెప్పారు.
రాబోయే రోజుల్లో కరోనా ఉగ్రరూపం చూపించబోతోందని ఆయన హెచ్చరించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు ముగిసిన తర్వాత రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతాయని ఫౌచీ అంచనా వేశారు.
మరోవైపు పండుగ సెలవుల నేపథ్యంలో అమెరికాలో ప్రయాణాలు ఊపందుకున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో ప్రయాణాల కారణంగా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత వారంలో రోజుకి సగటున పదిలక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు.గత నెలలో ‘థ్యాంక్స్ గివింగ్’ సెలవుల తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే.
అమెరికాలో ఇప్పటి వరకు 1,91,31,151 కేసులు నమోదవ్వగా… 3,33,115 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా, యూఎస్లో టీకా పంపిణీ కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే.
ఫైజర్, మోడెర్నా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు.ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా టీకాను ఇటీవల ఫౌచీ తీసుకున్నారు.
టీకా వేసుకున్న తర్వాత తనలో ఎటువంటి దుష్ప్రభావాలు లేవని.ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని ఆయన తెలిపారు.
అధికారిక సమాచారం ప్రకారం.ఇప్పటి వరకు 20 లక్షల మంది అమెరికన్లు టీకా వేయించుకున్నట్లు సమాచారం.