పదవిలో నుంచి దిగిపోతూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కోర్టు చేతుల్లో మొట్టికాయలు తప్పడం లేదు.తాజాగా మైనర్లుగా వున్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా అధ్యక్షుడిగా వున్నప్పుడు తీసుకొచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హూడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని పునరుద్ధరించాలని ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు.
మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు.చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.
చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి అక్రమంగా అమెరికా వచ్చిన వారికి రక్షణ కల్పించి, ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జస్టిస్ నికోలస్ పేర్కొన్నారు.2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నారు.2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది.అదే ఏడాది భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది.
డీఏసీఏ అంటే.
చిన్నతనంలోనే తల్లిదండ్రులతోపాటు వచ్చి. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో ఉంటున్నవారికి ప్రభుత్వపరమైన రక్షణ కల్పించేందుకు ఒబామా సర్కారు 2012లో డీఏసీఏ పథకాన్ని తీసుకొచ్చింది.దీని కింద దరఖాస్తు చేసుకున్న వారికి దేశంలో నివసించేందుకు రెండేళ్ల చట్టపరమైన రక్షణ లభిస్తుంది.అనంతరం పరిస్ధితిని బట్టి దీనిని రెన్యూవల్ చేసుకోవచ్చు.అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వర్క్ పర్మిట్ పొందేందుకూ డీఏసీఏ వీలు కల్పిస్తుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
జీరో టాలరెన్స్ విధానంతో ఎంతో మందిని దేశ సరిహద్దుల వద్దే నిలిపివేశారు.అధ్యక్ష ఎన్నికల్లో స్ధానికులను ఆకట్టుకోవడానికి గాను అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ, హెచ్–2బీ, జే, ఎల్1, ఎల్2 వీసాలపై నిషేధాన్ని ఈ ఏడాది చివరి వరకు పొడిగించారు.
అదే విధంగా గ్రీన్కార్డుల జారీని కూడా 2020 డిసెంబర్ వరకు నిలిపివేశారు.అయితే వీటిని సవాల్ చేస్తూ పలు సంస్థలు కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానాలు ట్రంప్ నిర్ణయాలకు అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే.