కరోనా సెకండ్ వేవ్తో భారతదేశం అల్లాడిపోతోంది.లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి.
పెరుగుతున్న కేసులకు సరిపడా ఆక్సిజన్, బెడ్లు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో దేశంలో మరణాల రేటు పెరిగిపోతోంది.ఈ స్థాయిలో సెకండ్ వేవ్ వుంటుందని ఊహించలేని కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారైన భారత్ ఇప్పుడు వ్యాక్సిన్, మందుల కోసం తోటి దేశాల సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
అయితే క్లిష్ట పరిస్ధితుల్లో ప్రపంచానికే అండగా నిలబడిన ఇండియా కోసం అంతర్జాతీయ సమాజం బాసటగా నిలవడం శుభపరిణామమనే చెప్పాలి.ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, సింగపూర్, సౌదీ అరేబియా వంటి దేశాలు పెద్ద ఎత్తున సాయం చేశాయి.
అటు వివిధ దేశాల్లలో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం జన్మభూమిని గట్టెక్కించేందుకు చేతనైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.
తొలి నాళ్లలో భారత్కు సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతగా మొగ్గుచూపకపోవడంతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లోని ఇండో అమెరికన్ నేతలు, పలువురు ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు.
దేశంలోని గోడౌన్లలో పడివున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను భారత్ సహా కోవిడ్తో అల్లాడుతున్న దేశాలకు సరఫరా చేయాలని కోరారు.అన్ని వైపు నుంచి విమర్శలు రావడంతోనే బైడెన్ కాస్త మెత్తబడి ప్రధాని మోడీకి ఫోన్ చేసి అండగా వుంటామని ప్రకటించారు.
ఆ తర్వాత నుంచి నేటికి కూడా సాయాన్ని కొనసాగిస్తున్నారు.భారత్లో నెలకొన్న పరిస్థితులను చూసి అమెరికాలోని దిగ్గజ టెక్, ఫార్మా కంపెనీలు, స్వచ్ఛంధ సంస్థలు, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలు తమకు తోచిన విధంగా ఆపన్న హస్తం అందిస్తున్న సంగతి తెలిసిందే.
యూఎస్లోని 40కి పైగా కార్పొరేట్ సంస్థలన్నీ ఒక టాస్క్ఫోర్స్గా ఏర్పడి భారత్కు దాదాపు 30 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి.
అయితే ఫెడరల్ ప్రభుత్వం నుంచి భారత్కు సాయం మరింత పెరగాల్సిన అవసరముందన్నారు అమెరికా కాంగ్రెస్ సభ్యులు.ఈ మేరకు సోమవారం కాంగ్రెస్లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.చట్టసభ సభ్యులైన బ్రాడ్ షెర్మన్, స్టీవ్ ఛాబట్ ఈ తీర్మానాన్ని రూపొందించారు.
భారత్కు అదనంగా వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, టీకాల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల సరఫరా, కొవిడ్ టెస్ట్ కిట్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు అందించాలని అందులో పేర్కొన్నారు.ఆరోగ్య రంగంలో భారత్తో మనదేశానికి ఏడు దశాబ్దాల బంధం ఉందని వారు గుర్తు చేశారు.
విపత్కర పరిస్ధితుల్లో అమెరికా ప్రైవేట్ సెక్టార్ కూడా భారత్కు అండగా నిలవడం ప్రశంసనీయం అన్నారు కాంగ్రెస్ సభ్యులు.గతేడాది అమెరికా కరోనాతో పోరాడుతున్న సమయంలో భారత్ హైడ్రాక్సీక్లోరోక్వీన్ టాబ్లెట్లు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలను అందించిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు.