కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్డీపన ప్యాకేజీ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది.చర్చ అనంతరం 220-211 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది.కరోనాతో పీకల్లోతు కష్టాల్లో వున్న అమెరికన్లను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని బిల్లు ఆమోదం పొందిన అనంతరం ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపారు.
ఇప్పటికే ఈ ఉద్దీపన ప్యాకేజీ బిల్లుకు అమెరికన్ సెనేట్ శనివారం ఆమోదం తెలిపింది. 50-49 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం.ఈ బిల్లుపై తొలి నుంచి అభ్యంతరాలు లేవనెత్తుతున్న రిపబ్లికన్లు కలిసికట్టుగా వ్యతిరేకించారు.అయితే ఒక్క ఓటు తేడాతో బిల్లుకు ఆమోదం లభించడం విశేషం.
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బైడెన్ అందుకున్న తొలి విజయంగా విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు.
ఈ బిల్లుపై బైడెన్ సంతకం కోసం వైట్హౌస్కు పంపించనున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేస్తారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ ప్రకటించారు.బైడెన్ సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది.
అప్పుడు ఈ బిల్లు అమలు కావడమే తరువాయి.బిల్లు అమలైతే అమెరికా పౌరులకు భారీ ఉపశమనం కలగనుంది.
దీని ద్వారా వారికి ఆర్థిక సాయం, పన్ను మినహాయింపులు, కోవిడ్పై పోరుకు నిధులను వెచ్చించనున్నారు.ఈ ఉద్దీపన ప్యాకేజీ అమలులోకి వస్తే సుమారు 400 బిలియన్ డాలర్లను అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందించనున్నారు.
ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కో అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు నేరుగా జమ కానున్నాయి.దీనితో పాటు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక బలోపేతానికి 350 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు.
నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు.అలాగే కొవిడ్-19 టీకా, టెస్టుల కోసం 50 బిలియన్ డాలర్లను కేటాయించనుంది బైడెన్ సర్కార్.
మరోవైపు కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను కాపాడుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఇప్పటికే 50 మిలియన్ల మందికి పైగా ప్రజలకు టీకాను పంపిణీ చేసింది.ప్రస్తుతం అగ్రరాజ్యంలో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు.ఇటీవల జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోస్ టీకాను అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.