ప్రస్తుతం కరోనా ధాటికి అమెరికా విలవిలలాడిపోతోంది.ఇప్పటికే 1.32 మిలియన్ల మంది దీని బారినపడగా, 70 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.వైరస్ సోకినవారిని కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి మరి పోరాడుతున్నారు.
అయితే పెరుగుతున్న కేసులకు సరిపడా మెడికల్ సిబ్బంది లేకపోవడం అగ్రరాజ్యాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గాను దేశంలో నిరుపయోగంగా ఉన్న గ్రీన్కార్డులను విదేశీ వైద్యులు, వైద్య సిబ్బందికి మంజూరు చేసేందుకు వీలుగా అమెరికన్ చట్టసభ సభ్యులు కాంగ్రెస్లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు.
హెల్త్కేర్ వర్క్ఫోర్స్ రెసిలెన్స్ యాక్ట్ని కాంగ్రెస్ ఆమోదిస్తే గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న గ్రీన్కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.వీటిని వేలాది మంది విదేశీ వైద్య నిపుణులు అమెరికాలో శాశ్వతంగా సేవలు అందించడానికి అవకాశం కల్పిస్తుంది.
ఇది చట్టంగా ఆమోదం పొందితే కోవిడ్ 19లో పోరాటంలో 25 వేల మంది నర్సులు, 15 వేల మంది డాక్టర్లు భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది.ఇది ప్రధానంగా హెచ్1బీ, జే2 వీసాదారులుగా వున్న భారతీయ నర్సులు, డాక్టర్లకు మేలు కలిగిస్తుంది.
సదరు బిల్లును ప్రతినిధుల సభలో, దీనిని చట్టసభ సభ్యులు అబ్బి ఫింకెనౌర్, బ్రాడ్ ష్నైడర్, టామ్కోల్, డాన్ బేకన్ ప్రవేశపెట్టారు.అమెరికన్ మెడికల్ అసోసియేషన్, హెల్త్కేర్ లీడర్షిప్ కౌన్సిల్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్కేర్ రిక్రూట్మెంట్, అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్, అమెరికన్ ఆర్గనైజేషన్ ఫర్ నర్సింగ్ లీడర్షిప్ సంస్ధలు ఈ చట్టానికి మద్ధతు ప్రకటించాయి.హెల్త్కేర్ వర్క్ఫోర్స్ రెసిలెన్స్ యాక్ట్ ద్వారా నిరుపయోగంగా ఉన్న 15 వీసాలను వైద్యుల కోసం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్యాట్రిస్ ఎ హారిస్ అన్నారు.దీని వల్ల కరోనా కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న వైద్య సిబ్బందిపై భారాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.