ట్రంప్ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… చివరికి సరిహద్దుల్లో గోడ కడుతున్నా అమెరికాకు వలసల తాకిడి మాత్రం తప్పడం లేదు.చట్టబద్ధంగా వచ్చే వారు కొందరైతే.
అక్రమంగా అగ్రరాజ్యంలోకి చొరబడేవారు మరికొందరు.తాజాగా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న 30 మంది వలసదారులను బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ అదుపులోకి తీసుకున్నారు.
అమెరికా-మెక్సికో సరిహద్దుకు ఉత్తరాన 25 మైళ్ల దూరంలో ఉన్న చెక్పాయింట్ వద్ద శనివారం రాత్రి ఒక సెమిట్రైలర్ వెనుక భాగంలో వలసదారులను తరలిస్తున్నారు.
సాధారణ తనిఖీలో భాగంగా ట్రక్కును అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మొదట వదలివేశారు.అయితే పోలీసు జాగీలం గట్టిగా అరవడంతో పాటు ట్రైలర్ చుట్టూ పదే పదే తిరగడంతో వారికి అనుమానం వచ్చి మరోసారి తనిఖీ చేయగా ట్రైలర్ వెనుక భాగంలో వలసదారులు కనిపించారు.వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నారు.
వీరంతా ఈక్వెడార్ నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీనిపై ఓ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ మాట్లాడుతూ.ట్రక్కు వెనుక భాగంలో గాలి కూడా అందని పరిస్ధితుల్లో వీరిని తరలిస్తున్నారని.ఈ రకమైన ప్రయాణం ప్రాణాలకే ప్రమాదమన్నారు.
గత కొన్నేళ్లుగా శరణార్థులను ఇదే తరహాలో దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నారని.దీనిని గుర్తించిన బోర్డర్ పెట్రోలింగ్ విభాగం తనిఖీలు ముమ్మరం చేసిందని గుర్తు చేశారు.
గత వారం లండన్లోని ఓ ట్రక్కులో 39 మృతదేహాలను కనుగొన్నారని.ఈ కేసులో కొందరు చైనీయులు అక్రమంగా బ్రిటన్కు వలసవచ్చేందుకు ప్రయత్నించారని ఆయన గుర్తుచేశారు.2017లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 10 వలసదారులు మరణించారు.వారు ప్రయాణించిన ట్రక్కులో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో పాటు వెంటిలేషన్ ద్వారాలు మూసుకుపోవడంతో ఈ దారుణం జరిగింది.