ప్రస్తుతం చైనా – అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే చైనా ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించడమో లేదంటే భారీగా సుంకాలు పెంచడమో చేస్తూ వచ్చింది.
ప్రపంచంలోని రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు వాణిజ్యపరమైన ఆంక్షలను చూపుతూ పరస్పరం హెచ్చరికలకు దిగుతుండడంతో ఈ పోరు కొత్త మలుపులు తీసుకోవచ్చని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా జిన్జియాంగ్ ప్రొడక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ కార్ప్స్ (ఎక్స్పీసీసీ) నుంచి పత్తి దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది.
చైనాలో మూడొంతుల పత్తిని ఎక్స్పీసీసీ ఉత్పత్తి చేస్తోంది.ఇది జిన్జియాంగ్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 17 శాతానికి సమానం.
ఒక్క 2019లోనే చైనా నుంచి 11 బిలియన్ డాలర్ల విలువైన కాటన్ టెక్స్టైల్, అపరల్ ప్రొడక్ట్స్ను అమెరికా దిగుమతి చేసుకుంది.
అమెరికాలోని ఎన్నో అపరల్ సంస్థలు ఎక్స్పీసీసీ ఉత్పత్తి చేసిన కాటన్ ఫైబర్పై ఆధారపడుతున్నాయి.
కాగా, రెండు దేశాల మధ్య వైరం అప్పుడప్పుడు మరో దేశానికి లబ్ధి చేకూరుస్తూ ఉంటుంది.తాజాగా చైనా కాటన్పై నిషేధం ప్రభావం భారత్కు మేలు చేస్తుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అంచనా వేస్తోంది.
ఇప్పటికే భారత దుస్తుల ఎగుమతిదారులకు ఆర్డర్లు పెరిగాయని ఏజెన్సీ తెలిపింది.
అయితే చైనా కాటన్పై అమెరికా నిషేధం విధించడానికి మనదేశం నుంచి కాటన్ ఎగుమతుల అవకాశాలు పెరిగాయి.ఈ ఆర్థిక సంవత్సరంలో భారత పత్తి ఎగుమతులు 65 లక్షల బేళ్లకు చేరతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.40 లక్షల బేళ్ల పత్తి మాత్రమే ఎగుమతి అవుతుందని జూన్లో అంచనా వేశారు.గతేడాది భారత్ నుంచి 40 లక్షల బేళ్ల పత్తి ఎగుమతయ్యింది.రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు 17 నెలల గరిష్టానికి చేరడంతో.ట్రేడర్ల ఆదాయం పెరగనుంది.హరికేన్ల ప్రభావంతో అమెరికాలో ఈసారి పత్తి పంట దెబ్బతింది.పత్తి ఉత్పత్తి 17.06 మిలియన్ బేళ్ల నుంచి 17.05 బిలియన్ బేళ్లకు తగ్గుతుందని అంచనా.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ పరిస్థితులు ప్రపంచ పత్తి, వస్త్ర మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
భారత్లో ఈ మార్కెటింగ్ ఏడాది (2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు) పత్తి దేశీయ వినియోగం తొలి అంచనా కన్నా ఏకంగా 51 లక్షల బేళ్లు తగ్గుతుందని తాజా అంచనా.లాక్డౌన్ కారణంగా కీలకమైన వేసవి సీజన్లో భారత్లో వస్త్ర వ్యాపారం పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం.ఈ మార్కెటింగ్ ఏడాది 3.31 కోట్ల బేళ్ల పత్తిని దేశీయంగా వినియోగిస్తారని తొలుత అంచనా వేయగా- లాక్డౌన్తో అది కాస్తా 2.80 కోట్ల బేళ్లకు పడిపోయిందని భారత పత్తి మిల్లుల సంఘం (సీఏఐ) తాజా అధ్యయనంలో వెల్లడించింది.దీని ఫలితంగా వచ్చే అక్టోబరు 1న కొత్త ‘మార్కెటింగ్ ఏడాది’(2020-21) ప్రారంభమయ్యే నాటికి భారత్లో అక్షరాలా అరకోటి బేళ్ల పాత పత్తి నిల్వలు గోదాముల్లో మూలుగుతుంటాయని సీఏఐ అంచనా వేసింది.
అయితే ప్రస్తుతం చైనా పత్తిపై అమెరికా నిషేధం విధించడంతో మనదేశంలో పత్తి గిరాకీ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.