దక్షిణాఫ్రికాలో పుట్టిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతోంది.ఊహించని వేగంతో లక్షలాది కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.
ముఖ్యంగా తీవ్రత అధికంగా వున్న దేశాలకు విమాన ప్రయాణాలపై నిషేధం విధించడంతో పాటు అటు నుంచి వచ్చే వారిని అన్ని రకాలుగా పరీక్షించిన తర్వాతే తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి.తాజాగా భారత్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు వెళ్లే విషయంపై పునరాలోచించాలని తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) భారత్కు లెవెల్ – 3 ట్రావెల్ హెల్త్ నోటీసు జారీ చేసిన తర్వాత ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఈ మేరకు అభ్యర్ధన రావడం గమనార్హం.
ఎఫ్డీఏ ఆమోదం పొందిన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లయితే .కోవిడ్ సంక్రమించే, తీవ్రమైన లక్షణాల బారినపడే ప్రమాదం తక్కువగా వుండొచ్చని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.టీకాలు తీసుకున్న, తీసుకోని ప్రయాణీకుల కోసం సీడీసీ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.గతేడాది నవంబర్లో సీడీసీ భారత్కు లెవల్ 1 కోవిడ్ 19 నోటీసును జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.భారత్లో మంగళవారం 17 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.2,85,914 మందికి పాజిటివ్గా తేలింది.గడిచిన రోజుతో పోల్చితే కేసుల్లో 11.7 శాతం వృద్ధి నమోదవ్వడం గమనార్హం.నిన్న కోవిడ్ కారణంగా 665 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే రికవరీల సంఖ్య మెరుగ్గా వుండటం సానుకూల అంశం.నిన్న 2,99,073 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.ఇప్పటి వరకు దేశంలో మొత్తం రికవరీలు 3.73 కోట్లకు చేరాయి.భారత్ ప్రస్తుతం థర్డ్ వేవ్తో పోరాడుతోందని.ఒమిక్రాన్ వేరియంట్ గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోందని అమెరికా భయపడుతోంది.దీనితో పాటు నేరాలు, ఉగ్రవాద ముప్పు వంటి పరిస్ధితుల దృష్ట్యా భారత పర్యటనకు వెళ్లడాన్ని ఆలోచించడంతో పాటు ఇప్పటికే భారత్లో వున్న వారు అప్రమత్తంగా వుండాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సూచిస్తోంది.