వచ్చే నెలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వున్న క్రైస్తవ సోదరులు అప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇంట్లోకి కావాల్సిన సరుకులు, క్రిస్మస్ ట్రీ, అలంకరణ వస్తువుల షాపింగ్తో పండుగ సందడి మొదలయ్యింది.
కేక్ మిక్సింగ్లు, చర్చిలలో ప్రత్యేక ప్రార్ధనలు మొదలవుతాయి.అలా అమెరికాలో జరిగిన క్రిస్మస్ పరేడ్లో విషాదం చోటు చేసుకుంది.
విస్కాన్సిన్లోని వౌకేశా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం క్రిస్మస్ పరేడ్ జరిగింది.వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ర్యాలీగా వెళ్లారు.
ఆ సమయంలో ఓ ఎస్యూవీ బారికేడ్లను ఢీకొట్టి మనుషుల మీదుగా దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.
దాదాపు 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు.
అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి కారుపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ డ్రైవర్ వేగంగా జనాల మీదకు వెళ్లాడు.ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై ప్రాణ భయంతో పరుగులు తీశారు.
అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.ఈ ఘటనకు కారణమైన ఎస్యూవీని సీజ్ చేసి.
.ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే నిందితుడు ఎవరు.? ఎక్కడి నుంచి వచ్చాడు.? అతని ఉద్దేశ్యం ఏంటన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.ఈ కేసు విచారణలో ఎఫ్బీఐ సహకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
మరోవైపు పరేడ్పైకి కారు దూసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాగా.2015లో ఓక్లహోమాలోని స్టిల్వాటర్లో ఫుట్బాల్ జట్టు సభ్యుల పరేడ్ను వీక్షిస్తున్న జనంపైకి ఓ మహిళ కారుతో దూసుకెళ్లిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా… 46 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ సంఘటన అప్పట్లో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.
మరుసటి సంవత్సరం జర్మనీ రాజధాని బెర్లిన్లో క్రిస్మస్ మార్కెట్లోకి ఒక ట్రక్కు దూసుకొచ్చిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలవ్వగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన వెనుక కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ హస్తం వున్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి.