అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నగదు, నగలు కోసం హత్యలు చేసేవారు కొందరైతే.
జాతి, వర్ణ వివక్షలతో ఉన్మాదులుగా మారేవారు మరికొందరు.ఏది ఏమైనా అక్కడ గన్ కల్చర్ వల్ల ఏటా వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీనికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నా.శక్తివంతమైన గన్ లాబీ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటోందన్న వాదనలు వున్నాయి.
ఇక తుపాకీ కాల్పుల్లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.
తాజాగా మెంఫిస్లోని టెన్నెస్సీ పోస్టాఫీస్లో మంగళవారం ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.
ఈ ఘటనలో యూఎస్ పోస్టల్ సర్వీస్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు చనిపోయారు.అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్ ఉద్యోగే అని పోలీసులు తెలిపారు.
నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం పోలీసులు గాలిస్తున్నామని వెల్లడించారు.ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.
మెంఫిస్ పట్టణానికి ఆగ్నేయంగా వున్న చారిత్రక ఆరెంజ్ మౌండ్ సమీపంలోని పోస్టాఫీసు వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.కాల్పుల ఘటన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం అనెక్స్ కాంప్లెక్స్కు వెళ్లే వీధిని పోలీసులు మూసివేశారు.
అయితే కాల్పులు ఆగిపోయిన తర్వాత ఒక తెల్లరంగు కారు బయటకు రావడాన్ని ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు.కానీ అది ఎవరికి చెందినదో తెలియాల్సి వుంది.
కాగా, నాలుగు రోజుల క్రితం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరానికి సమీపంలోని అర్లింగ్టన్లో వున్న టింబర్ వ్యూ పాఠశాలలో ఓ విద్యార్ధి తరగతి గదిలోనే తోటి విద్యార్ధులపై కాల్పులకు తెగబడిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.విద్యార్ధుల మధ్య తలెత్తిన ఘర్షణ కారణంగానే కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు తెగబడిన విద్యార్ధి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు పట్టుకున్నారు.
ఈ పాఠశాలలో మొత్తం 1,800 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు.కాల్పుల విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.