ఓ పశువుల పాకలో భారీ పేలుడు సంభవించింది.ఈ శబ్దం దాదాపు 2 కిమీల దూరం వరకు వినిపించింది.
భారీ శబ్దం వినిపించడంతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.ఏమిటా శబ్దం.
ఎక్కడి నుంచి వచ్చిందని తోటి గ్రామస్థులతో ప్రశ్నించుకున్నారు.ఆ పేలుడుకి సమీప ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు ఎలా జరిగిందని విచారణ కొనసాగించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలోని వేకనూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది.
గ్రామానికి చెందిన తుంగల దిలీప్ పశువుల పాకలో పేలుడు జరిగిందని, పాకలో ఉన్న సోడియం నైట్రేట్, అమోనియం నిల్వలు ఎక్కువ రోజులు ఉండటంతో గది పీడనం ఏర్పడిందని అన్నారు.దీంతో యూరియా బస్తాలు పేలినట్లు పోలీసులు వెల్లడించారు.
భయపడాల్సిన ప్రమాదం లేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.
నిల్వ ఉన్న యూరియా బస్తాలను ఇంట్లో కాకుండా బయట పెట్టాలని పోలీసులు సూచించారు.
యూరియా సంచుల పేలుడు ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.భూకంపం వచ్చిందేమోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కేసు విచారణలో ఉంది.