మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఉప్పెన’ వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి రావడంతో ఉప్పెన రిలీజ్ వాయిదా పడింది.
ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా లాక్డౌన్ ముగియగానే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నప్పటికీ, లాక్డౌన్ను పొడిగిస్తూనే వచ్చింది ప్రభుత్వం.ఈ కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సూచనలు కూడా లేవని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సమయంలో ఉప్పెన సినిమాను ఎడిట్ చేసే పనిని ముందు వేసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్.ఈ సినిమా రన్టైమ్ను రెండున్నర గంటలకంటే తక్కువ ఉండేలా చూసేందుకు పలు సన్నివేశాలను ఆయన తొలగిస్తున్నాడట.
తన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో అతడికి అదిరిపోయే డెబ్యూని ఇచ్చేందుకు సుకుమార్ తనవంతు సాయం చేస్తున్నాడట.ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోండగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
టాలీవుడ్ రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను కట్టిపడేసింది.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.