ఎవరినైనా పొగడాలన్నా, విమర్శించాలన్నా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తరువాతే ఎవరైనా.ఆయన వాగ్ధాటి, మాటల గారడీ అటువంటివి.
పార్లమెంటులో ప్రభుత్వం తరపున ప్రతిపక్షాలను విమర్శించాలంటే అందుకు సమర్ధుడు వెంకయ్యే.ఏ శాఖ తరపునైనా ఆయన వివరణ ఇవ్వగలరు.
ప్రతిపక్షాల నోరు మూయించగలరు.పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచీ ఒక్క రోజు కూడా పూర్తిస్థాయిలో సభ జరగలేదు.
ప్రతిరోజు గందరగోళమే…వాయిదాలు పడటమే.విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేసేదాకా సభ జరగనివ్వబోమని కాంగ్రెసు తేల్చి చెప్పింది.
దీనిపై వెంకయ్య బెంగళూరులో మాట్లాడుతూ ‘దేశానికి సుష్మాస్వరాజ్ పెద్ద ఆస్తి’ అని ఒక్క ముక్కలో తేల్చి పారేశారు.ఆమె ఎటువంటి తప్పు చేయలేదన్నారు.
ఆమె చట్ట విరుద్ధంగా వ్యవహరించలేదన్నారు.అనైతికంగా ప్రవర్తించలేదన్నారు.
బ్రహ్మాండంగా పనిచేసే మంత్రుల్లో ఆమె ఒకరన్నారు.ఆమె ప్రభుత్వానికే కాదు, దేశానికి గొప్ప ఆస్తి అని కితాబు ఇచ్చారు.
సుష్మా తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కాని ప్రతిపక్షం ఆ జవాబు కావాలనుకోవడంలేదని విమర్శించారు.ఆమె దుష్ర్పచారం చేస్తున్నారని అంటూ లలిత్ మోదీ వ్యవహారంలో ఆమె పూర్తిగా ‘మానవత్వం’తో వ్యవహరించారని అన్నారు.
ప్రధానిపై, మంత్రులపై చీప్ కామెంట్స్ చేయడం కాంగ్రెసు ఫ్యాషన్గా మారిందని వెంకయ్య విరుచుకుపడ్డారు.వెంకయ్య తనను ఆకాశానికి ఎత్తినందుకు సుష్మా ఆయనకు ధన్యవాదాలు చెబుతారేమో…!
.