పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, భాజపాకు అసలు పడదు.ఆ రాష్ర్టంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింస జరిగిందని ఆరోపిస్తూ కమ్యూనిస్టులతోపాటు భాజపా నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళన కార్యక్ర మాలు నిర్వహించారు.కాని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మమతను యమ పొగిడారు.
హఠాత్తుగా ఆమె మీద ఎక్కడలేని ‘మమత’ కురిపించారు.ఈ పని చేసింది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసు ఘన విజయం సాధించినందుకని చెప్పారు ఆయన.విజయం సాధించిన వారిని ప్రశంసించడం మంచి పనే గాని మరి మమత బద్ధ శతృవు కదా….! ఎలా ప్రశంసించారు? ఇది ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది? కోల్కతా వచ్చిన హర్షవర్ధన్ ‘ఆమె పోరాట యోధురాలని అందరికీ తెలుసు.పోరాటాల వల్లనే ఆమె ఈ రోజు ఈ స్థానంలో ఉన్నారు’ అని మెచ్చుకున్నారు.ఆమెలో కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయని చెప్పారు.తాను ఆమెను ప్రశంసించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని, ఆమె విజయం సాధించారు కాబట్టి ప్రశంసలకు అర్హురాలని చెప్పారు.మమతను ప్రశంసించడం వెనక తనకు ఏ రాజకీయ ఎజెండా లేదని, ఆమె విజయం సాధించింది కాబట్టే అభినందనలు తెలిపానని అన్నారు.
రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి.బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లు నాలుగు మంచి మాటలు వేసిపెడితే ఎప్పటికైనా ఉపయోగపడొచ్చు.