ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
ఇది ఈనాటిది కాదు.దశాబ్ధాల క్రితమే దీనికి బీజాలు పడ్డాయి.
అక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది నిరుపేదలే.దేశం కానీ దేశంలో పస్తులుండి, యజమాని చేతిలో చిత్రహింసలు అనుభవిస్తూ కుటుంబానికి డబ్బు పంపేవారు లక్షల్లో వున్నారు.
అయితే మారుతున్న కాలమాన పరిస్ధితులకు అనుగుణంగా విదేశాలకు వెళ్లే భారతీయ శ్రామికుల్లో నైపుణ్యాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో భాగంగా ఆదివారం కేంద్ర, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో ‘‘ఎమిరేట్స్ జాబ్స్ అండ్ స్కిల్స్ (తేజాస్) ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
యూఏఈలోని మన దేశ కార్మికుల్లో నైపుణ్యం పెంచడం, మార్కెట్ అవసరాల కోసం భారతీయ శ్రామిక శక్తిని సన్నద్ధం చేసే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా రెండో రోజు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.
భారత్లో యువ జనాభా అధికంగా వుందని చెప్పారు.దేశ నిర్మాణం, ఇమేజ్ బిల్డింగ్ రెండింటిలోనూ యువత అతిపెద్ద వాటాదారు అని అనురాగ్ చెప్పారు.
భారత్ నుంచి పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ప్రపంచానికి అందించడమే తమ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.భారత్-యూఏఈల మధ్య వున్న బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
యూఏఈలో 10 వేలమంది భారతీయ శ్రామిక శక్తిని సృష్టించడాన్ని తొలి దశలో లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.
ఇకపోతే.భారత్, యూఏఈలోని చలనచిత్ర, వినోద రంగానికి చెందిన పరిశ్రమ నేతలతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు.ఈ- విజన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో ఒలివర్ బ్రామ్లీ, హంగామా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు నీరజ్ రాయ్, టాటా ప్లే ఎండీ, సీఈవో హరిత్ నాగ్పాల్ తదితరులు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.
ఇక భారత్లో టీవీ, రేడియో, ఓటీటీ తదితర మాధ్యమాలు మంచి వ్యూయర్షిప్ను కలిగి వున్నాయని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.అబుదాబి ఫిల్మ్ కమీషన్కు చెందిన ఫిల్మ్ కమీషనర్ హన్స్ ఫ్రైకిన్తో జరిగిన చర్చలో ప్రముఖ భారతీయ దర్శకులు కబీర్ ఖాన్, ప్రియదర్శన్ వంటి వారిని కూడా మంత్రి కలిశారు.
దుబాయ్ ఎక్స్పో 2020లోని ఇండియన్ పెవిలియన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వీక్కు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఠాకూర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం దుబాయ్ చేరుకున్నారు.