పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ రాష్ట్రంలో పోరు కీలకంగా రెండు పార్టీల మధ్యనే సాగుతుండటం, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించు కోవడానికి తీవ్రంగా కృషి చేస్తుండగా, మరో వైపు మమతా బెనర్జీ కూడా ఈ రాష్ట్రంలో తనకున్న పరపతి ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి పావులు కదుపుతుండటం తెలిసిందే.
ఇదే సమయంలో ఇక్కడ కోవిడ్ కేసులు కూడా ఈ నేతలతో పోటీ పడుతున్నాయి.ఈ నేపధ్యంలో బెంగాల్ లో ఆదివారం కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో మొత్తం 8,419 నమోదయ్యాయి.
ఈ క్రమంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి ఊహించని షాక్ తగిలింది.ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇకనుంచి ఎన్నికల ర్యాలీలకు దూరంగా ఉండనున్నారని సమాచారం.
ఈ సందర్భంగా టీఎంసీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ కోల్కతాలో ఈనెల 26న నిర్వహించనున్న సభ ఆమె ఆఖరు ఎన్నికల ప్రచార సభ అని ఆదివారం తెలిపారు.ఇకపోతే ఎన్నికల ర్యాలీల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా జరుగుతుందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు వారి ప్రచారాలను రద్దు చేసుకుంటున్న విషయం విదితమే.కాగా ఇప్పటికే సీపీఐ(ఎం) తో పాటు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వారి ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నారు.ఇదే బాటలో మమతా బెనర్జీ కూడా సాగడం గమనానర్హం.