భారత్ లోని ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులలో ఒకటైన లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ పై నెలరోజుల పాటు తాత్కాలిక మారటోరియం విధించింది.
గతంలో ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంకుకు కూడా ఆర్బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.డిసెంబర్ 16వ తేదీ వరకు లక్ష్మీ విలాస్ బ్యాంకుపై మారటోరియం అమలు కానుండగా ఆర్బీఐ విత్ డ్రాలపై ఆంక్షలు విధించింది.
లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఖాతాదారులు అకౌంట్లలో ఎంత మొత్తం ఉన్నా కేవలం 25 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది.దీంతో ఖాతాదారులు బ్యాంకు లావాదేవీల విషయంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
మారటోరియం ముగిసిన అనంతరం లక్ష్మీవిలాస్ బ్యాంకును సింగపూర్ కు చెందిన డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ విలీనం చేయాలని ఆర్బీఐ యోచిస్తోంది.
ఆర్బీఐ ఒక ప్రకటనలో డిపాజిటర్లకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.అయితే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం లక్ష్మీవిలాస్ బ్యాంక్ ఖాతాదారులను టెన్షన్ పెడుతోంది.ఖాతాదారులు ఎవరైనా 25,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకోవాలని భావిస్తే ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి తాత్కాలిక మారటోరియం అమలులోకి వచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ సూచనల మేరకు మారటోరియం విధించింది.
ఆర్బీఐ లక్ష్మీవిలాస్ బ్యాంక్ డైరెక్టర్లను సైతం తొలగించింది.కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టీఎన్ మనోహరన్ ను ఆర్బీఐ లక్ష్మీవిలాస్ బ్యాంకుకు అడ్మినిస్ట్రేటర్ గా నియమించింది.
డబ్బులు ఎక్కడికీ పోవని ఖాతాదారులు అనవసర భయాందోళనకు గురి కావద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.