అధికారంలోకి రాకముందు.వచ్చిన తర్వాత ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు జో బైడెన్.
ఎన్నికల ప్రచారంలో ఈ డోసు మరింత ఎక్కువైంది.ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నారు.
సహజంగానే గత ప్రభుత్వ విధానాలను కొత్తగా అధికారికంగా వచ్చిన వారు రద్దు చేయడం సహజమే.ఇదే సూత్రాన్ని బైడెన్ అవలంభిస్తున్నారు.
ఇప్పటికే వలస విధానాలు, మెక్సికో గోడ, వీసా సమస్యలు, పారిస్ వాతావరణ ఒప్పందం వంటి అంశాల్లో తన స్టాండ్ ఏంటో బైడెన్ చూపించారు.అయితే ఓ విషయంలో మాత్రం బైడెన్.
ట్రంప్నే ఫాలో అవబోతున్నట్లు అమెరికాలో కథనాలు వస్తున్నాయి.అదే చైనాతో విదేశాంగ విధానం.
అగ్రరాజ్యానికి అన్ని రంగాల్లో కొరకరాని కొయ్యగా వున్న చైనాను గత అమెరికా అధ్యక్షుల కంటే ఎక్కుగా శత్రువుగా చూశారు డొనాల్డ్ ట్రంప్.
మరీ ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై మొదలైన తర్వాత ట్రంప్ చైనా పట్ల తీవ్రమైన విధానాలను అవలంభించారు.
ముఖ్యంగా వైరస్ కారణంగా అమెరికా తీవ్రంగా ఎఫెక్టవడం.లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సామర్ధ్యంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.ఇది కూడా ట్రంప్కు చైనా పట్ల తీవ్ర ఆగ్రహం కలిగించింది.అంతేగాకుండా చైనా పట్ల మెతక వైఖరి అవలంభిస్తుందన్న కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ట్రంప్ కఠిన వైఖరి అవలంభించారు.
ట్రంప్ తప్పుకున్న తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బైడెన్ చైనా పట్ల ఎలాంటి విధానాన్ని అవలంభిస్తారన్న చర్చ జరిగింది.ట్రంప్ అంతటి తీవ్ర స్థాయిలో బైడెన్ వ్యవహరించరన్న వాదనలు కూడా వినిపించాయి.
అయితే అలాంటి ఊహాగానాలకు తెర దించుతూ చైనా పట్ల అమెరికా ధోరణిలో ఎలాంటి మార్పుండదని తెలుస్తోంది.చైనాను కార్నర్ చేసే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్దమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.
వివిధ రంగాల్లో చైనా నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించాల్సిన అవసరం ఉందని బైడెన్ భావిస్తున్నారు.ఇదే అభిప్రాయాన్ని అమెరికాలో సెనేట్ మెజారిటీ నాయకుడు చుక్ షుమర్ సైతం అభిప్రాయపడుతున్నారు.తద్వారా అమెరికా పౌరుల ఉపాధిని రక్షించడంతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని షుమర్ ఆకాంక్షించారు.ఆ దిశగా ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను ఆయన ప్రతిపాదించారు.
వీటిని సెనేట్లోని ప్రధాన కమిటీలకు తెలియజేశారు.అందుకనుగుణంగా చట్టబద్ధమైన ప్యాకేజీలను రూపొందించాలని కోరారు.
భారత్ వంటి మిత్రదేశాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.ఈ మేరకు వచ్చే స్ప్రింగ్ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలని షుమర్ కోరారు.
భారత్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు నాటో దేశాలలో పెట్టుబడులు పెట్టి… చైనాకు ధీటైన వాణిజ్య వాతావరణాన్ని సృష్టించాలని బైడెన్ యంత్రాంగం భావిస్తోంది.భారత్ పట్ల ట్రంప్ ఎంత సానుకూలంగా మాట్లాడినా హెచ్1బీ వీసాల విషయంలో ఆయన కఠిన చర్యల కారణంగా భారతీయులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఈ వీసాల విషయంలో బైడెన్ ప్రభుత్వం స్పష్టమైన మార్పులను తీసుకువస్తోంది.