జగన్ పరిపాలన పై ఇప్పుడు ఒక్కో నాయకుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ, విమర్శలు చేస్తూ వస్తున్నారు.తాజాగా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జగన్ రెండేళ్ల పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు.ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వ్యవహారంపై ఆయన స్పందించారు.
ఏపీ అసెంబ్లీ లో వైసీపీ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిందని, విపక్షం లేకుండా సభ నిర్వహించి ఇక ప్రయోజనం ఏంటి అంటూ ఉండవల్లి ప్రశ్నించారు అలాగే కాగ్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు.పోలవరం తో సహా ఏపీలో ఏ అభివృద్ధి పని జరగలేదని, ఏపీ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిందని , ముందు ముందు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదని ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యవహారం పైన ఉండవల్లి స్పందించారు .హరికృష్ణ , పురంధేశ్వరి తో తనకు పరిచయం ఉందని , వారు చాలా మంచివారు అని అదేసమయంలో ఎన్టీఆర్ కుమార్తెలు పై తాను ఎటువంటి చెడు ప్రచారాలు వినలేదని , కానీ ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.అంత దారుణంగా చంద్రబాబు ఏడ్చారు అని, ఆయనది డ్రామా అని తాను అనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.కానీ చంద్రబాబు అంతగా స్పందించాల్సిన సమస్య కాదని, ఏడిస్తే సానుభూతి రాదనే విషయం చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు.
ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించక పోవడాన్ని తప్పుబట్టారు.జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో పోల్చుకుంటున్నారు అని, కానీ ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవని అందుకే ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారని ఉండవల్లి అన్నారు .
కానీ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని, అవినీతి ఎక్కడ లేదో చూపించాలని జగన్ కు సవాల్ విసిరారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కనీస బాధ్యత అని, తమిళనాడు సీఎం స్టాలిన్ వరద బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న తీరుని ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఏపీ మంత్రి కొడాలి నాని వ్యవహారం పైన పరోక్షంగా స్పందించారు. కొంతమంది సభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటలు దారుణంగా ఉంటున్నాయని, వాడు వీడు అంటూ చంద్రబాబును ఓ మంత్రి తిట్టిపోస్తుండడం సరికాదంటూ ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.