ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని కరోనా మహమ్మారి ప్రమాదంలోకి నెట్టేసింది.ఈ కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో వ్యవస్థలు అన్ని మూతబడిపోయాయి.
అలాగే వస్తు కొనుగోలు గణనీయంగా పడిపోయింది.కేవలం ప్రజలు నిత్యాసర వస్తువులకి తప్ప ఇతర వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
దీంతో వ్యవస్థలలో చాలా కంపెనీలు ఆర్ధిక నష్టాలలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది.ప్రైవేట్ రంగంపై గణనీయమైన ప్రభావం చూపించిన ఈ కరోనా కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయి ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది.
లాక్డౌన్ ప్రభావం ఇప్పుడే పోదని, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఇప్పట్లో తిరిగి కోలుకునే పరిస్థితి లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది.రానున్న రెండు, మూడు నెలల్లో ప్రపంచ కార్మిక శక్తిలో సగం అంటే దాదాపు 2 వందల కోట్ల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదం పొంచివుందని, తాత్కాలిక ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బిసిజి) తన తాజా అధ్యయనంలో పేర్కొంది.
కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ కార్మిక శక్తిలో వచ్చే మార్పులను అంచనా వేయడం చాలా కష్టతరమని నివేదిక అభిప్రాయపడింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ ఏడాది 3.4 ట్రిలియన్ డాలర్ల మేర అదాయం కోల్పోనున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాలను బిసిజి నివేదిక ఈ సందర్భంగా గుర్తుచేసింది.రానున్న రెండు, మూడు నెలల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగం కోల్పోతారని, నిరుద్యోగం 17 శాతానికి మించి ఉంటుందని అధ్యయన పరిశోధకులు పేర్కొన్నారు.
లేబర్ మార్కెట్పై ఈ ప్రభావం పరిశ్రమల వారీగా చూసుకుంటే వ్యత్యాసం ఉంటుందని నివేదిక తెలిపింది.ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న రంగాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా మూతపడిన పరిశ్రమల్లో దాదాపు 80 శాతం రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, హౌటల్, రెస్టారెంట్ వ్యాపారం, టూరిజం, నిర్మాణ రంగాలే అని వెల్లడించింది.2030 నాటికి ఆటోమేషన్ సాంకేతికత దాదాపు 12 శాతం ఉద్యోగాలను రిస్క్లో పెడుతుందని, 30 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయని పేర్కొంది.