యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) న్యాయవాదిగా భారతీయ సామాజిక వేత్త, నోబెల్ పురస్కార గ్రహిత కైలాష్ సత్యార్థి నియమితులయ్యారు.ఈ మేరకు శుక్రవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు.
సత్యార్థితో పాటు స్టెమ్ కార్యకర్త వాలెంటినా మునోజ్ రబనాల్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాండ్స్మిత్, కే పాప్ సూపర్స్టార్స్ బ్లాక్ పింక్లను ఎస్డీజీ కొత్త న్యాయవాదులుగా నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఈ సందర్భంగా యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ మాట్లాడుతూ.
కొత్తగా నియమితులైన ఈ ఎస్డీజీ న్యాయవాదులు తమ సరికొత్త విధానాలతో సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా నడిపించటమే కాక తమ ఆశయాలను నెరవేర్చుకోగలరంటూ ధీమా వ్యక్తం చేశారు.అలాగే దేశ పురోభివృద్ధికై 17 అంశాలతో కూడిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం యూఎన్ సభ్య దేశాలు కలిసి పనిచేస్తామని అంగీకరించిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలోనే 2030 కల్లా ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ సుస్థిరాభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్ష్యాల గురించి కూడా గుటెర్రెస్ ప్రస్తావించారు.
కాగా, పాకిస్థాన్లో మహిళా చైతన్యానికి కృషి చేస్తున్న బాలిక మలాలా యూసఫ్ జాయ్కి, భారతదేశంలో బాలల హక్కుల సాధనకు కృషి చేస్తున్న కైలాష్ సత్యార్థిలు 2014 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతులకు ఎంపికైన సంగతి తెలిసిందే.కైలాష్ సత్యార్థి ఎంతోకాలంగా మనదేశంలో బాలల హక్కులను కాపాడటానికి తాను స్థాపించిన బచపన్ బాచావో ఆందోళన్ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు.సత్యార్థి నోబెల్ పురస్కారం అందుకున్న ఏడవ భారతీయుడు.1990 నుంచి ఎన్నో ఇబ్బందులకు గురైనా ఉద్యమాన్ని మాత్రం పక్కకు పెట్టలేదు.దాదాపు 80 వేల మంది బాల కార్మికులకు వెట్టి నుంచి విముక్తి కల్పించారు సత్యార్ధి.