కరోనా వైరస్ కారణంగా దేశాలకు దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశాయి.దీంతో వివిధ దేశాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లిన వారితో పాటు విహారయాత్రకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీలైనంత వరకు భారత ప్రభుత్వం పలువురు భారతీయులను విడతల వారీగా స్వదేశానికి తీసుకొచ్చింది.అయితే ఆంక్షలు కఠినం కావడంతో ఇంకా లక్షలాది మంది భారతీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయారు.
వీసా గడువు ముగుస్తుండటం, నిలువ నీడ లేకపోవడంతో ఆయా దేశాల్లో భారతీయుల అవస్థలు వర్ణనాతీతం.
వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమెరికా ఇప్పటికే వీసా గడువును పొడిగించడమో లేదంటే తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడమో చేసింది.
తాజాగా బ్రిటన్ కూడా అదే దారిలో నడిచింది.స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న భారతీయులు సహా పలు దేశాల పౌరులకు మే 31 వరకు అన్ని రకాల వీసాలను పొడిగిస్తున్నట్లు యూకే తెలిపింది.
ప్రస్తుతం అమల్లో వున్న కఠినమైన ప్రయాణ ఆంక్షల కారణంగా పట్టుబడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ అన్నారు.
భారత్ సహా తదితర దేశాల నుంచి వచ్చిన వారిని యూకేలో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు ఆమె తెలిపారు.ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు యూకే అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ప్రీతి చెప్పారు.వీసా గడువును పొడిగించడం ద్వారా ప్రజల ఆందోళనను దూరం చేస్తున్నామని, అలాగే కీలకమైన సేవల్లో ఉన్నవారు ఎప్పటిలాగే తమ పని తాము చేసుకోవచ్చునని ఆమె వెల్లడించారు.
జనవరి 24 తర్వాత వీసా గడువు ముగిసిన వారు, ప్రయాణ ఆంక్షలు, సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న కారణంగా బ్రిటన్ విడిచి వెళ్లేలేని వారికి ఈ పొడిగింపు వస్తుందని హోం సెక్రటరీ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతానికి ఇది మే 31 వరకు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత పరిస్ధితులను బట్టి దీనిని మరింత పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
పై పేర్కొన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ పరిస్ధితిని ఈ మెయిల్ ద్వారా ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్కు సమాచారం అందిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబడవని హోంశాఖ పేర్కొంది.యూకే ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే గడువు ముగిసిన వివిధ దేశాల పర్యాటకులు, విద్యార్ధులు, ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది.
గడువు ముగిసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు CIH@homeoffice.gov.uk అనే ఈమెయిల్ను సంప్రదించవచ్చునని హోంశాఖ తెలిపింది.