కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యూరప్లో కలకలం రేపుతోంది.ముఖ్యంగా బ్రిటన్లో ఇది ఊహకందని వేగంతో విస్తరిస్తోంది.
ఒకే రోజు 101 కొత్త కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.తాజా కేసులతో కలిపి యూకేలో ఇప్పటి వరకు మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 437కు చేరుకున్నట్లు బ్రిటన్ ఆరోగ్య అధికారులు మంగళవారం ప్రకటించారు.
ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.బ్రిటన్లో కొత్తగా 45,691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,560,341కు చేరుకుంది.
అలాగే వైరస్ వల్ల 180 మంది ప్రాణాలు కోల్పోగా.
ఇప్పటి వరకు బ్రిటన్లో కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,45,826కు చేరింది.ఇకపోతే అక్కడ 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు వారిలో దాదాపు 89 శాతం మంది మొదటి డోసు టీకా తీసుకోగా… 81శాతం కంటే ఎక్కువ మంది రెండు డోసులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో సమీక్షించారు.వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
బ్రిటన్లో వైరస్ బారినపడిన వారిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలైన నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే వెలుగుచూశాయని ప్రభుత్వం వెల్లడించింది.ఈ నేపథ్యంలో యూకే సర్కార్ అప్రమత్తమైంది.అంతర్జాతీయ ప్రయాణికులపై మరోసారి కఠిన ఆంక్షలు తీసుకొచ్చింది.యూకేకు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే నైజీరియా నుంచి వస్తున్న వారిని హోటళ్లకు తరలిస్తున్నామని యూకే ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ పేర్కొన్నారు.అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని జావిద్ వెల్లడించారు.