లివర్పూల్లోని ఆసుపత్రి వెలుపల బాంబు పేలుడు సంభవించిన ఘటన తర్వాత బ్రిటన్ సోమవారం దేశంలో తీవ్రవాద ముప్పు స్థాయిని పెంచింది.ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ ఒక ప్రకటన చేశారు.
ఇంటెలిజెన్స్ అధికారులు ముప్పును గణనీయమైన స్థాయి నుంచి తీవ్రమైన స్థాయికి పెంచినట్లు ఆమె తెలిపారు.లివర్పూల్ ఉమెన్స్ ఆసుపత్రి వెలుపల టాక్సీ పేలిన ఘటనలో ప్రయాణీకుడు చనిపోయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హెచ్చరికల స్థాయి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రీతి పటేల్ తెలిపారు.గత నెలలో వెటరన్ బ్రిటీష్ ఎంపీ డేవిడ్ అమెస్ ఆగ్నేయ ఇంగ్లాండ్లోని చర్చిలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.
దీనిలో ఉగ్రవాద కోణం వుందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
మరోవైపు లివర్పూల్ దాడి ఘటనపై బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు.
ఇది మనమంతా అప్రమత్తంగా వుండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోందన్నారు.బ్రిటీష్ ప్రజలు ఉగ్రవాదానికి ఎన్నడూ భయపడరని ఆయన పునరుద్ఘాటించారు.
తెలివి తక్కువ చర్యలతో మమ్మల్ని విభజించాలని చూసే వారికి తాము ఎప్పటికీ లొంగబోమని జాన్సన్ స్పష్టం చేశారు.వాయువ్య ఇంగ్లాండ్లో ఉగ్రవాద వ్యతిరేక పోలీసింగ్కు ఇన్ఛార్జ్ అయిన రస్ జాక్సన్ మాట్లాడుతూ.
లివర్పూల్ దాడికి గల ఉద్దేశ్యం అస్పష్టంగా వుందని అన్నారు.
క్యాబ్లో మంటలు చెలరేగి, దానిని ఫైర్బాల్గా మార్చిన ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం మరణించిన ప్రయాణికుడే తయారు చేశాడని జాక్సన్ మీడియాతో చెప్పారు.దీనిని ఉగ్రవాద సంఘటనగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు.సమీపంలోని లివర్పూల్ కేథడ్రల్లో రిమెంబరెన్స్ వద్ద ఆదివారం ప్రార్థనకు కొద్దినిమిషాల ముందు పేలుడు సంభవించింది.
దీనికి సంబంధించి నగరంలోని కెన్సింగ్టన్ ప్రాంతంలో ముగ్గురు అనుమానితులను తీవ్రవాద చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.మరో వ్యక్తిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.కెన్సింగ్టన్ సమీపంలోని సెప్టన్ పార్క్లో కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జాక్సన్ తెలిపారు.
కాగా, అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) అక్టోబర్ నెలలో స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరయ్యారు.
ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా దాడిచేసిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.తీవ్ర రక్తస్రావమైన ఎంపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ డేవిడ్ ప్రాణాలు విడిచారు.
అమీస్ 1983 నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు.ఎసెక్స్లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జంతు సమస్యలతోపాటు, మహిళల గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు.
గతంలోనూ బ్రిటన్లో ఎంపీలపై దాడులు జరిగాయి.2016 బ్రెగ్జిట్ సమయంలో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్ కాల్చివేతకు గురయ్యారు.2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్పై దాడిచేసిన దుండగులు ఆయనను కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు.2000వ సంవత్సరంలో లిబరల్ డెమొక్రటిక్ ఎంపీ నీగెల్ జోన్స్పై దాడి జరిగింది.జులై 30, 1990లో కన్జర్వేటివ్ ఎంపీ ఇయాన్ గౌ కారు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు.