తల్లి కడుపులోంచి బయటపడ్డప్పటి నుంచి మనిషి ప్రయాణిస్తూనే వున్నాడు.ఆదిమ కాలంలో తిండి, స్థిరజీవనం, ఆశ్రయం కోసం మనిషి నిరంతరం ప్రయాణం సాగించేవాడు.
ఈ క్రమంలో వేటలుండేవి, కొట్లాటలుండేవి.కాలం గడిచింది ఖండాలు, దేశాలు ఏర్పడ్డాయి.
కానీ వలసలు మాత్రం ఆగడం లేదు.ఒకప్పుడు తన కోసం ప్రయాణిస్తే.
ఇప్పుడు మరొకడు తరిమితే ప్రయాణిస్తున్నాడు.ఒకప్పుడు ఆకలితో ప్రయాణిస్తే.
ఇప్పుడు భయంతో ప్రయాణిస్తున్నాడు.అలాగే ప్రపంచం ఓ కుగ్రామం కావడంతో మెరుగైన జీవనం, ఉపాధి కోసం ప్రజలు విదేశాలకు వలస వెళ్తున్నారు.
ఈ వలసకున్న ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని ప్రతి ఏటా డిసెంబర్ 18న ప్రపంచ వలసల దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి.
అయితే ఈ వలసలు కొన్ని దేశాలకు మేలు చేస్తుంటే… మరికొన్నింటికి మాత్రం ఇబ్బందికర పరిస్ధితులు తెస్తున్నాయి.
ఇందులో బ్రిటన్ కూడా ఒకటి.అక్రమ వలసల కారణంగా ఆ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడంతో పాటు ఉపాధి అవకాశాలు, వసతి కల్పించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.
ఈ క్రమంలోనే యూకే హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ దేశంలోని వలసలను దండయాత్రతో పోల్చారు.కెంట్లోని మాన్స్టన్ ప్రాసెసింగ్ సైట్లోని పరిస్ధితుల గురించి ఆందోళనల మధ్య హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రశ్నలకు సమాధానమిస్తూ .వారంతా కష్టాల్లో వున్న శరణార్ధులుగా నటించడం మానేయాలంటూ హోంమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ వలసలకు అడ్డుకట్ట వేసే నిర్ణయం తీసుకున్నారు.తక్కువ నాణ్యత గల డిగ్రీలు తీసుకున్న వారిని, వారిపై ఆధారపడిన వారిని దేశంలోకి అనుమతించడంపై నియంత్రణలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు 10 డౌనింగ్ స్ట్రీట్ను ఉటంకిస్తూ బీబీసీ నివేదించింది.
యూకేకు వలసలు రికార్డు స్థాయిలో హాఫ్ మిలియన్కు చేరుకున్నాయని గణాంకాలు చెబుతుండటంతో ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.విద్యార్ధి వీసాలపై కఠినమైన నియంత్రణలు అమల్లోకి వస్తే.
వలసలు భారీగా తగ్గుతాయని యూకే ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.మరి రాబోయే రోజుల్లో రిషి సునాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.