కరోనా వైరస్కు ఇప్పటి వరకు మందు లేకపోవడంతో ప్రపంచం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.దీనిలో ఒకటి ప్లాస్మాథెరపీ.
కోవిడ్ సోకి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించే ‘‘ కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ’’ కొత్త ఆశలు రేకిత్తిస్తోంది.జబ్బు నుంచి కోలుకున్నవారి ప్లాస్మాలో వైరస్ను ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చిన యాంటీబాడీలుంటాయి.
అందువల్ల దీనిని వైరస్తో బాధపడుతున్న వారికి ఎక్కిస్తే జబ్బు నుంచి త్వరగా కోలుకోవటానికి వీలవుతుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటు నిపుణులు కూడా ప్లాస్మా దానం చేయాల్సిందిగా కోరుతున్నారు.
తాజాగా యూకే ప్రభుత్వం కూడా కరోనా నుంచి కోలుకున్న భారత సంతతితో పాటు ఇతర దక్షిణాసియా ప్రజలను ప్లాస్మా దానం చేయాల్సిందిగా అత్యవసర విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు ప్రభుత్వ రంగ ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.శ్వేతజాతీయులతో పోలిస్తే దక్షిణాసియా ప్రజల్లో తయారవుతున్న యాంటీబాడీలు కరోనా చికిత్సకు అనువుగా ఉన్నాయట.
దీనికి తోడు మిగిలిన వారితో పోలీస్తే దక్షిణాసియన్లపైనే కోవిడ్ ఎక్కువగా దాడి చేస్తోందని ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ (ఎన్హెచ్ఎస్బీటీ) కన్సల్టెంట్ హేమటాలజిస్ట్ రేఖా ఆనంద్ అన్నారు.
ఇప్పటి వరకు ప్లాస్మా దాతలలో 7 శాతానికి పైగా, ఆసియా వారసత్వ ప్రజలే ఉన్నారు.ప్లాస్మా దానం సురక్షితమైనదని, దీనిని సేకరించేందుకు సుమారు 45 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఎన్హెచ్ఎస్బీటీ కన్సల్టెంట్ డోనర్ మెడిసిన్ డాక్లర్ శ్రుతి నారాయణ వివరించారు.కాగా కోవిడ్ సోకిన దక్షిణాసియా వర్గాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం వుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ) నివేదిక తేల్చింది.కరోనా నుంచి కోలుకున్న శ్వేతజాతీయుల ప్లాస్మాలో 22.4 శాతం (9,509 కి గాను 2,126) యాంటీబాడీలు ఉండగా.అదే ఆసియా నేపథ్యం వున్న వారిలో 44.1 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
యూకే వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ప్లాస్మా డొనేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ప్రధానంగా లండన్, బర్మింగ్ హామ్, లీసెస్టర్, మాంచెస్టర్లలో దక్షిణాసియా జనాభా ఎక్కువగా వుంది.
ప్లాస్మా దానం అనేది అవసరంలో ఉన్న వారికి సహాయపడే మార్గమని.ప్లాస్మా డొనేషన్ చేయడం ద్వారా, కోవిడ్తో బాధపడుతున్న వారు సమస్య నుంచి బయటపడటానికి సాయం చేసినట్లవుతుందని డోనర్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ నైమ్ అక్తర్ అన్నారు.
కాగా వ్యాక్సిన్ ట్రయల్స్లో భారత సంతతితో పాటు దక్షిణాసియాకు చెందిన ప్రజలు పాల్గొనాలని ఈ వారం మొదట్లో యూకే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.భారతీయ భాషలైన గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూలలో ఇందుకు సంబంధించిన ప్రకటనను ప్రసారం చేశారు.