ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి.సైబర్ కేటుగాళ్ల వల్ల కోట్లాది రూపాయలను పోగొట్టుకున్న అభాగ్యులు ఎందరో.
ఇలాంటి వారి నుంచి ప్రజలను కాపాడేందుకు భారత్, యూకే ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి.ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం భారత్లోని ఆరు నగరాల్లోని 10 అనుమానిత కార్యాలయాలపై సీబీఐతో కలిసి సిటీ ఆఫ్ లండన్ పోలీసులు దాడులు నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను సిటీ ఆఫ్ లండన్ పోలీస్ వెల్లడించింది.ఈ సంస్థలు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సేవల పేరుతో మోసాలకు పాల్పడుతూ బ్రిటన్ పౌరులను మోసం చేసినట్లు వారు తెలిపారు.
ఈ మోసపూరిత సంస్థలపై చర్యలు తీసుకోవడానికి భారత్లోని పోలీసులకు తమ సమాచారం సహాయపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తీసుకుంటున్న చర్యలను లండన్ పోలీసులు అభినందించారు.
ఈ సంస్థలు బాధితుల కంప్యూటర్లలో పాప్ అప్ సందేశాల ద్వారా మాల్వేర్ను చొప్పిస్తాయి.ఆ తర్వాత బాధితులు తమ కంప్యూటర్లను బాగు చేయించుకోవడానికి హెల్ప్లైన్ నెంబర్లకు ఫోన్ చేయమని సూచించడంతో పాటు సర్వీసుకు గాను రుసుము వసూలు చేసేవారు.
ఈ ఫీజును కేవలం ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా చెల్లించాలని షరతు పెట్టేవారు.దీని ద్వారా వినియోగదారుల ఆర్ధిక లావాదేవీల సమాచారాన్ని తస్కరించేవారు.
దీనికి సంబంధించిన ఆధారాలను తాము సీబీఐకి అందించామని లండన్ పోలీసులు తెలిపారు.వాటి ఆధారంగా భారతీయ దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకుని దాడులు నిర్వహించడాన్ని లండన్ పోలీసులు ప్రశంసించారు.
నేరస్థులను భారత్లోని కోర్టుల ద్వారా శిక్షించడానికి తాము అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.బ్రిటన్, భారత్ పోలీసులు, మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో ఈ కేసులపై దర్యాప్తు చేస్తున్నారు.