బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి ఎంపీ రిషి సునక్ తన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.తొలి వార్షిక బడ్జెట్లోనే కరోనాతో తీవ్రంగా కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు గాను రూ.3 లక్షల కోట్ల ప్యాకేజ్ను ప్రకటించారు.ఆయన నిర్ణయంపై బ్రిటన్ వ్యాపార వేత్తలతో పాటు యూకేలోని భారతీయ వ్యాపార సమాజం సైతం ప్రశంసలు కురిపించింది.తాజాగా కోవిడ్-19 కారణంగా ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రిషి సునక్ తెలిపారు.80 శాతం మంది ఉద్యోగులు వేతనాలు ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు.
దీనిలో భాగంగా ఉపాధి లేని వారికి నెలకు 2,500 పౌండ్ల వరకు తామే చెల్లిస్తామని ఆయన తెలిపారు.శనివారం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్తో కలిసి డౌనింగ్ స్ట్రీట్లో మీడియాతో మాట్లాడిన ఆయన దేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వమే ప్రజల వేతనాలు చెల్లించబోతోందని చెప్పారు.
కరోనా వైరస్ జాబ్ రిటెన్షన్ స్కీమ్ కింద కంపెనీలు ఎవరైతే పేరోల్లో ఉండి పని చేయకుండా ఉన్నారో వారి వివరాలను ట్యాక్స్ డిపార్ట్మెంట్, హెచ్ఎంఆర్సీని సంప్రదించాలని సునక్ స్పష్టం చేశారు.అలాగే కరోనా వైరస్ బిజినెస్ ఇంటరప్షన్ స్కీమ్ కింద ఆరు నెలలు నుంచి 12 నెలల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామని, ఇవి సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయని రిషి చెప్పారు.
నగదు ప్రవాహన్ని కొనసాగించడానికి వచ్చే త్రైమాసిక వ్యాట్ చెల్లింపులను వాయిదా వేస్తామని ఛాన్సలర్ తెలిపారు.యూకే ప్రభుత్వ ఆర్ధిక స్పందన ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైనదని రిషి సునక్ పేర్కొన్నారు.
ప్రజలు తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడం, అద్దె చెల్లించకపోవడం, ఆహారం, బిల్లుల కోసం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం గురించి ఆందోళన చెందుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.కాగా యూకే ఆర్ధిక వ్యవస్థకు సహాయాన్ని అందించడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వారంలో రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.
మరోవైపు వైరస్ వ్యాప్తి పెను సవాల్ విసురుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని మరింత కఠినతరం చేసేందుకు యూకే సిద్ధమైంది.థియేటర్లు, వ్యాయామ శాలలు, పార్క్లు, బార్లు, పబ్బులు వంటి ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడే కేంద్రాలను మూసివేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు.ఇప్పటి వరకు కరోనా కారణంగా బ్రిటన్లో 177 మంది మరణించగా, 3,269 మంది వైరస్ బాధితులుగా ఉన్నారు.