కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో వివిధ అవసరాల నిమిత్తం పలు దేశాలకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వీరిలో ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
ఆర్దిక వ్యవస్థలు కుప్పకూలుతుండటంతో ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోతున్నారు.దీంతో ఆ దేశంలో ఉండలేక భారత్కు రాలేక ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో బ్రిటన్లో చిక్కుకున్న మన వారికి అక్కడి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.విదేశీయుల అన్ని రకాల వీసాలపై గడువును యూకే ప్రభుత్వం జూలై 31 వరకు పొడిగించింది.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా బ్రిటన్లో ఉంటున్న విదేశీయులు, పౌరులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వారి వీసా గడువును జూలై వరకు పెంచింది.మార్చి 31వ తేదీ తర్వాత వరకు గడువు ముగిసిన వారందరికీ ఈ పెంపు వర్తిస్తుందని యూకే అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ సమయంలో ప్రజల క్షేమం కోసం, విదేశీయులకు అండగా నిలబడటం కోసం ప్రభుత్వం తీసుకున్న అపూర్వమైన చర్యలలో ఇది ఒకటి అని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ అన్నారు.ప్రస్తుతం తమ దేశంలో గడువు ముగిసిన టూరిస్ట్ వీసాలపై ఉన్న వారు, జూలై 31 లోపు ఇంటికి చేరుకోలేని వారందరికీ సహాయం చేయడానికి ఈ పొడిగింపును అందిస్తున్నట్లు ఆమె చెప్పారు.కాగా భారతదేశంలో అత్యవసర పరిస్ధితి ఉన్న ఓసీఐ కార్డుదారులు మరియు విశ్వవిద్యాలయ విద్యార్ధులు స్వదేశం రావడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా యూకేలో ఇప్పటి వరకు 2,54,195 మందికి కరోనా సోకగా, 36,398 మంది ప్రాణాలు కోల్పోయారు.