బ్రిటన్లో పెట్రోల్, డీజిల్, ఆహార సమస్య నానాటికీ జఠిలమవుతోంది.పరిస్ధితి అదుపులోనే వుందని ప్రధాని బోరిస్ జాన్సన్ చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.
సమస్య తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే బ్రిటీష్ ఆర్మీ రంగంలోకి దిగింది.ఆయిల్ ట్యాంకర్లను స్వయంగా జవాన్లే నడపుతూ చమురు కంపెనీలు, రిఫైనరీల నుంచి ఫిల్లింగ్ స్టేషన్లకు తీసుకొస్తున్నారు.
దాదాపు నెల రోజులుగా యూకే వ్యాప్తంగా ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద విపరీతంగా రద్దీ నెలకొంది.ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డు కనిపిస్తుండంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం బ్రిటన్ను దాదాపు 1,00,000 మంది డ్రైవర్ల కొరత వేధిస్తోంది.క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతిమంగా ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
దేశంలోని మొత్తం 8,380 ఫిల్లింగ్ స్టేషన్లలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి వున్న ఇండిపెండెంట్ రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్రోల్ రిటైలర్స్ అసోసియేషన్ (పీఆర్ఏ) తమ స్టేషన్లలో 37 శాతం ఇంధనం ఖాళీ అయ్యిందని తెలిపింది.ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన బ్రిటన్ను తాజా పెట్రోల్ సంక్షోభం గందరగోళానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో బ్రిటీష్ ప్రభుత్వం దిగివచ్చింది.ఫారిన్ ట్రక్ డ్రైవర్లకు సంబంధించి అమల్లో వున్న ఆంక్షలను సడలించాలని నిర్ణయించింది.
తద్వారా క్రిస్మస్కు ముందే సప్లై చైన్ సంక్షోభాన్ని నివారించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.గతంలో యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన డ్రైవర్లు బ్రిటన్ చేరుకున్న ఏడు రోజుల్లోగా రెండు పిక్ అప్లు, రెండు డ్రాప్ ఆఫ్లు చేసుకోవాల్సి వచ్చేది.
కొత్త నిబంధనల ప్రకారం.విదేశీ ట్రక్ డ్రైవర్లు రెండు వారాల వ్యవధిలో అపరిమిత పర్యటనలు చేసుకోవచ్చు.
ఇది వేలాది మంది అదనపు లారీ డ్రైవర్లను రోడ్డుపైకి తీసుకురావడంతో సమానమని యూకే రవాణా శాఖ మంత్రి గ్రాంట్ శాప్స్ మీడియాతో అన్నారు.బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ జీ 7 దేశాలలోని అన్నింటి కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందని ఇదే సమయంలో ఒత్తిళ్లు కూడా ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు.క్రిస్మస్ పర్వదినం నాటికి ప్రజలు అన్ని వస్తువులు పొందుతారని శాప్స్ హామీ ఇచ్చారు.మరోవైపు సప్లై చైన్ సంక్షోభం కారణంగా ప్రపంచంలోని అతపెద్ద కంటైనర్ పోర్టులు ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు మూసుకుపోయే అవకాశం వుందని బ్రిటీష్ పోర్ట్స్ అథారిటీ ఇటీవల హెచ్చరించింది.
ఇదే సమయంలో మాంసం ప్రాసెసింగ్ పరిశ్రమలో కార్మికుల కొరత కారణంగా 1,50,000 పందులను చంపేందుకు గాను 800 మంది విదేశీ కసాయిలకు తాత్కాలిక వీసాలను జారీ చేస్తామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది.